కారుతో ఢీకొట్టి పారిపోయిన కేసులో నిందితుడైన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సంఘటన స్థలంలో ఉన్నట్టు మరో ఇద్దరు సాక్షులు గుర్తించారు.
ముంబై: కారుతో ఢీకొట్టి పారిపోయిన కేసులో నిందితుడైన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సంఘటన స్థలంలో ఉన్నట్టు మరో ఇద్దరు సాక్షులు గుర్తించారు. సోమవారం ముంబై కోర్టుకు హాజరైన ఆయనను వారు గుర్తుపట్టారు. 2002లో జరిగిన ఈ ప్రమాదానికి కొన్ని గంటల ముందు సల్మాన్ స్నేహితులతో కలిసి తన బార్కు వచ్చాడని, అయితే ఆయన మద్యం తాగారో లేదో తనకు తెలియదని జుహూలోని రెయిన్ బార్ యజమాని రిజ్వాన్ చెప్పాడు. సల్మాన్ రంగులేని ద్రవమున్న గ్లాసుతో కనిపించాడని, అది మద్యమో కాదో తెలియదని, ఆయన వద్ద మద్యం వాసన రాలేదని వెల్లడించాడు.
ప్రమాదం తర్వాత సల్మాన్ కారు దిగుతుండగా చూశానని మరో సాక్షి రామశ్రీపాండే చెప్పాడు. సల్మాన్ రెయిన్ బార్లో మద్యం తాగి, మత్తులో కారును ఫుట్పాత్పై నిద్రిస్తున్న వారిపై నుంచి పోనివ్వడంతో ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారని ప్రాసిక్యూషన్ ఆరోపిస్తుండడం తెలిసిందే.