తెగబడిన గొలుసు దొంగలు | Shooters chain thieves | Sakshi
Sakshi News home page

తెగబడిన గొలుసు దొంగలు

Oct 18 2015 3:53 AM | Updated on Sep 3 2017 11:06 AM

తెగబడిన గొలుసు దొంగలు

తెగబడిన గొలుసు దొంగలు

నగరంలో గొలుసు దొంగలు మరో సారి తెగబడ్డారు. శనివారం ఒకే రోజు పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లకు...

నగరంలో గొలుసు దొంగలు మరో సారి తెగబడ్డారు. శనివారం ఒకే రోజు పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. వివరాలిలా ఉన్నాయి.
 

శుభ కార్యానికి వెళ్లి వస్తుండగా..
కాచిగూడ: భర్తతో కలిసి శుభకార్యానికి హాజరై బైక్‌పై ఇంటికి వెస్తున్న మహిళ మెడలోంచి ఎనిమిదిన్నర తులాల బంగారు గొలుసు గుర్తుతెలియని వ్యక్తులు తెంపుకుపోయిన సంఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. డీఎస్సై కృష్ణయ్య కథనం మేరకు.. రాంకోఠికి చెందిన స్వర్ణలత (53) శుక్రవారం రాత్రి హిమాయత్‌నగర్‌లో శుభకార్యానికి వెల్లి భర్తతో కలిసి బైక్‌పై ఇంటికి తిరిగివస్తుండగా నారాయణగూడలోని క్రిస్టియన్ శ్మశాన వాటిక సమీపంలో వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలోని ఎనిమిదిన్నర తులాల బంగారు ఆభరణాలను తెంచుకొని పారిపోయారు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు నారాయణగూడ డీఎస్సై కృష్ణయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
పరికరాలు తెమ్మన్నారని చెప్పి..
జగద్గిరిగుట్ట: పరికరాలు తీసుకురావడానికి వచ్చానని చెప్పి ఓ మహిళ మెడలో నుంచి ఆగంతకుడు రెండు తులాల బంగారు గొలుసు తెంపుకెళ్లిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కుషాల్‌కర్ కథనం ప్రకారం.. సంజయ్‌పురి కాలనీకి చెందిన జనార్ధన్ టైల్స్ పనులు చేసేవాడు. శనివారం ఉదయం అతని భార్య జయలక్ష్మి ఇంటిపై  బట్టలు ఆరేస్తుండగా అక్కడికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి  సార్ టైల్స్ వేయడానికి సామాను తీసుకు రావాలని తనను పంపినట్లు చెప్పాడు.

దీంతో ఆమె అతని గుర్తించలేదని సార్‌తో ఫోన్‌లో మాట్లాడించాలని చెప్పడంతో అతను ఫోన్ చేస్తున్నట్లు నటించి ఫోన్ కలవడం లేదని చెప్పాడు. దీంతో జయలక్ష్మి తన సెల్ నుంచి భర్తకు ఫోన్ చేస్తుండగా అతను ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు, సెల్‌ఫోన్‌లను లాక్కుని పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
మహిళను బెదిరించి..
జియాగూడ:  మహిళను బెదిరించి బంగారు ఆభరణాలు దోచుకున్న సంఘటన కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ రాంమోహన్‌రావు కథనం ప్రకారం..న్యూ గంగానగర్‌లో మాందాల రమేష్, రాధ దంపతులు నివాసం ఉంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు వారి ఇంటి కాంపౌండ్‌లోకి చొరబడ్డారు. అప్పుడే గదిలో నుంచి బయటకు వచ్చిన రాధను బెదిరించి నోట్లో గుడ్డలు కుక్కి ఆమె మెడలో నుంచి నాలుగు తులాల పుస్తెలతాడు, కమ్మలు, కాలి గొలుసులు ఎత్తుకెళ్లారు. వీటి విలువ రూ.1.20 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 
గుడికి వెళ్లి వస్తుండగా...
బన్సీలాల్‌పేట్: దైవ దర్శనం కోసం వెళ్లి వస్తున్న మహిళ మెడలో నుంచి పుస్తెల తాడు తెంపుకెళ్లిన సంఘటన గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బన్సీలాల్‌పేట్‌కు చెందిన ప్రేమ్‌కుమార్, అతని భార్య శైలజతో కలిసి లోయర్‌ట్యాంక్‌బండ్‌లోని కట్టమైసమ్మ దేవాలయానికి  వెళ్లి తిరిగివస్తుండగా జీరా అనాథ శరణాలయం సమీపంలో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన దొంగలు శైలజ మెడలోని పుస్తెలతాడు, నల్లపూసల దండను లాక్కొని వెళ్లారు. గాంధీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
లంబాకు జైలుశిక్ష
సాక్షి, సిటీబ్యూరో: జంట పోలీసు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 383 బంగారు గొలుసు దొంతనాలకు ప్పాడిన కరుడుగట్టిన చైన్ స్నాచర్ సయ్యద్ హుస్సేన్ అలియాస్ లంబా హుస్సేన్ అలియాస్ లంబాకు నాంపల్లి నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శనివారం జైలు శిక్ష విధించింది. గత ఏడాది కాచిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన రెండు చైన్ స్నాచింగ్ కేసుల్లో ఇతడికి ఒక్కో కేసులో ఏడాదిన్నర జైలు శిక్ష విధించినట్లు ఈస్ట్‌జోన్ పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement