పరుగెత్తాల్సింది ఒక మైలే! | Police run only one kilometer! | Sakshi
Sakshi News home page

పరుగెత్తాల్సింది ఒక మైలే!

Aug 12 2015 4:19 AM | Updated on Sep 17 2018 6:20 PM

పోలీసు ఎంపిక ప్రక్రియలో సమూల మార్పులు రానున్నాయి. స్క్రీనింగ్ టెస్ట్‌గా ఉన్న 5 కిలోమీటర్ల పరుగును తొలగించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

పోలీసు ఎంపిక పరీక్షలో కీలక మార్పులు
సాక్షి, హైదరాబాద్: పోలీసు ఎంపిక ప్రక్రియలో సమూల మార్పులు రానున్నాయి. స్క్రీనింగ్ టెస్ట్‌గా ఉన్న 5 కిలోమీటర్ల పరుగును తొలగిం చాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీని స్థానంలో ఒక మైలు(1.6 కి.మీ.) పరుగును చేర్చనున్నారు. డీజీపీ జేవీ రాముడు మంగళవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఎంపిక ప్రక్రియలో మార్పుచేర్పులను ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించారు. పోలీసు ఎంపిక రాత పరీక్ష లోనూ మార్పులు చేయనున్నారు.

ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహించాలని యోచిస్తున్నారు. ప్రభుత్వ ఆమోదం లభిస్తే ఇకపై జరిగే అన్ని రిక్రూట్‌మెంట్లలో ఇదే విధానాన్ని అమలు చేస్తారు. ఆబ్జెక్టివ్ తరహాలో ఉండే ప్రిలిమ్స్‌ను స్క్రీనింగ్ పరీక్షగా నిర్వహించి, తర్వాత దేశదారుఢ్య పరీక్షలతోపాటు ఈవెంట్స్ నిర్వహించాలని భావిస్తున్నారు. వీటిలో అర్హత సాధించినవారికి మెయిన్స్ పరీక్ష ఉంటుంది.

రాష్ట్రంలో పోలీసు నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేయాలని, ఎంపిక విధానంలోనూ మహిళలకు కొన్ని వెసులుబాట్లు ఇవ్వాలని అధికారులు సూచించారు.  పోలీసు విభాగంలో ఖాళీగా ఉన్న హోంగార్డు పోస్టుల భర్తీతోపాటు వీరికిస్తున్న రోజువారీ వేతనాన్ని రూ.400కు పెంచాలంటూ పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం వ్యక్తం చేసిన అభ్యంతరాలకు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని డీజీపీ నిర్ణయించారు.

Advertisement
 
Advertisement
Advertisement