
మరో మంత్రి జంప్.. అగ్రనటుడి మద్దతు!
ముఖ్యమంత్రి పీఠం లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వానికి క్రమంగా మద్దతు పెరుగుతోంది.
ముఖ్యమంత్రి పీఠం లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వానికి క్రమంగా మద్దతు పెరుగుతోంది. మొదట ఇద్దరు ఎమ్మెల్యేలు, నేతలతో రాజకీయ చదరంగాన్ని ప్రారంభించిన పన్నీర్ గూటికి వరుసగా నేతలు వలస కడుతున్న పరిస్తితి కనిపిస్తోంది. ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఓపీఎస్కు జై కొట్టగా.. తాజాగా మరో మంత్రి అదే బాటలో నడిచారు. తమిళనాడు గ్రామీణ పరిశ్రమలశాఖ మంత్రి పీ బెంజమిన్ తాజాగా ఓపీఎస్ గూటికి చేరారు. ఇప్పటికే విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్, మత్య్సశాఖ మంత్రి జయకుమార్ ఓపీఎస్కు అండగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు మాజీ మంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత రాజేంద్ర ప్రసాద్ కూడా సెల్వానికి జైకొట్టారు. దీంతో సెల్వం వర్గంలో చేరుతున్న అన్నాడీఎంకే నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
కోలివుడ్ మద్దతు సెల్వానికే!
ఇప్పటికే పలువురు కోలివుడ్ ప్రముఖులు ఓపీఎస్కు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. కమల్ హసన్, ఆర్య, ఖుష్బూ, గౌతమి తదితరులు సెల్వానికి సీఎం పదవి అప్పగించాలని కోరగా.. తాజాగా మరో అగ్రనటుడు అదే బాటలో సాగారు. సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు శరత్కుమార్ ఓపీఎస్కు మద్దతు పలికారు. జయలలిత ఉన్నప్పుడు అన్నాడీఎంకేకు మిత్రపక్షంగా కొనసాగిన ఆయన ఇప్పుడు పన్నీర్ సెల్వం వెంట నడుస్తానంటూ ప్రకటించారు.
ఈరోజు చేరికలు!
ఈరోజు (శనివారం) ఇద్దరు ఎంపీలు అశోక్కుమార్, పీఆర్ సుందరం పన్నీర్ సెల్వం గూటికి చేశారు. అదేవిధంగా శశికళకు నమ్మకస్తుడైన నేతగా భావిస్తున్న దిండిగల్ శ్రీనివాస్ కూడా సెల్వం జైకొట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. తనపై తిరుగుబాటు చేయడంతో పన్నీర్ సెల్వాన్ని శశికళ పార్టీ కోశాధికారి పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఆ పదవిని దిండిగల్ శ్రీనివాసన్కు అప్పగించారు. ఇప్పుడు ఆయనే పన్నీర్ సెల్వం గూటికి చేరుతుండటం తమిళనాట మారుతున్న రాజకీయ పరిస్థితులను ప్రతిబింబిస్తున్నది. అంతేకాకుండా అన్నాడీఎంకేకు మీడియా గొంతుగా ఉన్న ఆ పార్టీ అధికారి ప్రతినిధి సీ పొన్నియన్ కూడా చిన్నమ్మకు ఝలక్ ఇచ్చారు. ఆయన తాజాగా పన్నీర్ సెల్వానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు.