‘గ్రిడ్’ కూల్చేందుకు సీఎం కుట్ర : కోదండరాం | Nobody can't stop telangana, says Kodandaram | Sakshi
Sakshi News home page

‘గ్రిడ్’ కూల్చేందుకు సీఎం కుట్ర : కోదండరాం

Oct 9 2013 2:50 AM | Updated on Jul 29 2019 5:28 PM

‘గ్రిడ్’ కూల్చేందుకు సీఎం కుట్ర : కోదండరాం - Sakshi

‘గ్రిడ్’ కూల్చేందుకు సీఎం కుట్ర : కోదండరాం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ఉద్యోగులను పావుగా వినియోగించుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుగా నిలుస్తున్నారని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు.

 పిల్ల చేష్టలతో తెలంగాణను ఆపలేరు: కోదండరాం
ఇద్దరు పిల్లలూ ముఖ్యమేనన్న చంద్రబాబుకు తెలంగాణ బిడ్డపై ప్రేమెందుకు లేదు?

 
 ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ఉద్యోగులను పావుగా వినియోగించుకుని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుగా నిలుస్తున్నారని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. విద్యుత్ ఉద్యోగులతో గ్రిడ్‌ను కుప్పకూల్చే ప్రయత్నాలు చేయిస్తూ.. దక్షిణాది రాష్ట్రాలను అంధకారంలో నెట్టేందుకు కుయుక్తులు పన్నుతున్నారని  ఆగ్రహం వ్యక్తంచేశారు. పిల్లచేష్టలతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఆత్మార్పణం చేసుకున్న కాకి కుమార్ ద్వితీయ వర్ధంతి సభ మంగళవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని కొంగరకలాన్‌లో జరిగింది.  కార్యక్రమానికి కోదండరాం, టీజేఏసీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా  కోదండరాం మాట్లాడుతూ  పవర్‌గ్రిడ్‌లు కూల్చేయాలని ప్రయత్నం చేయడం పిల్లచేష్టలుగా భావిస్తున్నామన్నారు.
 
 ఉద్యోగ సంఘాలతో కృత్రిమ ఉద్యమం చేయిస్తూ సీమాంధ్రకు చెందిన నాయకులు బొత్స సత్యనారాయణ, హర్షకుమార్‌లపై దాడులు చేయిస్తున్నారన్నారు. సమైక్య నినాదం ఎత్తుకుని తమలో తామే ఘర్షణలు, దాడులకు దిగుతున్నారంటే వారి మధ్యనే సమైక్యత కొరవడిందనే విషయం స్పష్టమవుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సీఎం కిరణ్ విద్యుత్ సంక్షోభం సృష్టించి సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో ఆస్పత్రుల్లో అత్యవసర విభాగాల్లో చికిత్స పొందేవారు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం సీమాంధ్ర ప్రాంతానికి మాత్రమే ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తూ.. తెలంగాణ ప్రాంతంపై హక్కున్నట్లు వ్యవహరించడం సరికాదన్నారు.  
 
 దినేశ్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏం సమాధానం చెబుతాడు..?
 తెలంగాణ వస్తే నక ్సలిజం సమస్య పెరుగుతుందని.. తనతో కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇవ్వాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పాడన్న మాజీ డీజీపీ దినేశ్‌రెడ్డి వ్యాఖ్యలకు కిరణ్‌కుమార్‌రెడ్డి ఏం సమాధానం చెబుతాడని కోదండరాం ప్రశ్నించారు. దినేశ్‌రెడ్డి  చెప్పినట్లు కిరణ్ సీమాంధ్రకు బలగాలను పంపకుండా అడ్డుకట్ట వేస్తున్నారన్నారు. అనంత పురం ఎస్పీని సస్పెండ్ చేయాలని బెదిరింపులకు దిగడం.. ఏపీఎన్జీవోల సభలకు అనుమతి కోసం దినేశ్‌రెడ్డిపై ఒత్తిడి తెచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో పుట్టాను.. ఇక్కడే పెరిగాను అని చెప్పుకొచ్చే కిరణ్ తెలంగాణకు అడ్డొస్తూ ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు.
 
 ఇద్దరు పిల్లల బాబుకు ఒక్కరే ముద్దా..?
 తనకు తెలంగాణ, సీమాంధ్ర.. ఇద్దరు పిల్లల్లాంటి వారని.. ఇద్దరూ ముఖ్యమని కాకమ్మ కథలు చెబుతున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమైక్యం కోసం ఎందుకు దీక్ష చేస్తున్నాడని కోదండరాం ప్రశ్నించారు. చంద్రబాబుకు తెలంగాణపై నిజంగా ప్రేమే వుంటే దీక్షల నాటకమెందుకని ప్రశ్నించారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను 60 రోజుల్లో ఆపాలనుకోవడం అవివేకమైన చ ర్యగా ఆయన అభివర్ణించారు. తెలంగాణ ప్రజల నిధులను, నీళ్లను దోపిడీకి అలవాటు పడ్డ సీమాంధ్రులు ఇప్పుడు విభజన అనేసరికి భరించలేకపోతున్నారని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement