గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ.. అత్యంత కీలకమైన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కోసం ఢిల్లీకి చేరుకోనున్నారు.
బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని అందరూ భావిస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ.. అత్యంత కీలకమైన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కోసం ఢిల్లీకి చేరుకోనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన గాంధీనగర్ నుంచి ఢిల్లీకి బయల్దేరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయంలోని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ఏర్పాటుచేయనున్నారు. అయితే, ఈ సమావేశం జరుగుతున్న విషయం తనకు తెలియదని పార్టీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలోనే మోడీ ప్రధాని అభ్యర్థిత్వం గురించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ, మరికొంతరు నాయకులు కూడా మోడీ అభ్యర్థిత్వంపై వ్యతిరేకతతో ఉన్న విషయం తెలిసిందే. పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో జరగనుంది.