మహారాష్ట్రలో ఆదివారం సంభవించిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరింది. తొలుత ఈ ప్రమాదంలో 18 మంది మరణించినట్లు భావించగా మరో ముగ్గురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
మహారాష్ట్రలో ఆదివారం సంభవించిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 21కి చేరింది. తొలుత ఈ ప్రమాదంలో 18 మంది మరణించినట్లు భావించగా మరో ముగ్గురు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. బాధితులు చికిత్స పొందుతున్న వివిధ ఆస్పత్రుల నుంచి ఈ మరణాల సమాచారం అందినట్లు రాయగఢ్ పోలీసు అధికారి పి.కె. పాటిల్ తెలిపారు. రైలు పట్టాలు తప్పడంతో తీవ్రంగా గాయపడిన 120 మంది ప్రయాణికులను నాగోథానె, రోహా, అలీబాగ్ ఆస్పత్రులకు తరలించారు. మరీ విషమంగా ఉన్నవారిని ముంబైకి తరలించారు. కొంకణ్ రైల్వే పరిధిలో రైళ్ల రాకపోకలను సోమవరం తెల్లవారుజామున పునరుద్ధరించారు.
ఆదివారం ఉదయం 9.40 గంటలకు దివా- సావంత్వాడీ ప్యాసింజర్ రైలు ఇంజన్, నాలుగు బోగీలు ముంబైకి 100 కిలోమీటర్ల దక్షిణంగా ఉన్న నాగోథానె వద్ద పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. రైలుపట్టా ఒకటి విరిగిపోవడం వల్లే ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పి ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రైల్వే భద్రత కమిషనర్ చేతన్ బక్షి ఈ ప్రమాదంపై విచారణ నిర్వహిస్తారు.