రాజకీయ పార్టీలకు విశ్వసనీయతే ఆస్తి అని, కాంగ్రెస్లో టీఆర్ఎస్ విలీనం అంశంపై మాటమీద ఉంటామని కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చారని ఎంపీ పొన్నం ప్రభాకర్ చెప్పారు.
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు విశ్వసనీయతే ఆస్తి అని, కాంగ్రెస్లో టీఆర్ఎస్ విలీనం అంశంపై మాటమీద ఉంటామని కేసీఆర్ గతంలోనే హామీ ఇచ్చారని ఎంపీ పొన్నం ప్రభాకర్ చెప్పారు. శనివారం రాత్రి ఆయన ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, సురేష్ షెట్కర్తో కలిసి ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ‘‘తెలంగాణ కోసం పుట్టిన పార్టీగా కాంగ్రెస్లో విలీనానికి టీఆర్ఎస్ సిద్ధంగా ఉందని సీడబ్ల్యూసీ తీర్మానం అనంతరం దిగ్విజయ్ చెప్పారు. దానికి కేసీఆర్ కూడా స్పందిస్తూ మాట మీద ఉంటామన్నారు. ఉద్యమకారుడిగా కేసీఆర్పై మాకు గౌరవం ఉంది’’ అని పొన్నం పేర్కొన్నారు. ‘‘సీమాంధ్రుల సమస్యల పరిష్కారంలో మేం భాగమవుతాం. అలాగే మా సమస్యల పరిష్కారంలో కూడా వారి మద్దతు కావాలి’’ అని ముగ్గురు ఎంపీలు పేర్కొన్నారు. కాగా, లగడపాటి వ్యవహరించిన తీరు అంతర్జాతీయంగా మచ్చ తెచ్చిందన్నారు.