నటుడి మృతి కేసు సీబీఐకి బదిలీ | Investigation into the death of actor Kalabhavan Mani transferred to CBI | Sakshi
Sakshi News home page

నటుడి మృతి కేసు సీబీఐకి బదిలీ

May 18 2017 3:33 PM | Updated on Sep 5 2017 11:27 AM

నటుడి మృతి కేసు సీబీఐకి బదిలీ

నటుడి మృతి కేసు సీబీఐకి బదిలీ

విలక్షణ నటుడు కళాభవన్ మణి మృతి కేసును సీబీఐ ఛేదించనుంది.

తిరువనంతపురం: విలక్షణ నటుడు కళాభవన్ మణి మృతి కేసును సీబీఐ ఛేదించనుంది. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సీఐబీకి బదిలీ చేశారు. నెలరోజుల్లోగా విచారణ ప్రారంభించాలని కేంద్ర దర్యాప్తు సంస్థను గత నెలలో ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసుపై దర్యాప్తు చేసేందుకు అంతకుముందు సీబీఐ నిరాకరించడంతో కళాభవన్ మణి భార్య, సోదరుడు కోర్టును ఆశ్రయించారు.

మలయాళంతో పాటు ఇతర భాషాల్లో 200 సినిమాల్లో నటించిన కళాభవన్ మణి గతేడాది మార్చి 6న అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేరళ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కళాభవన్ మణి దేహంలో అత్యంత విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్(మిథనాల్) అవశేషాలు కనుగొన్నట్టు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడికావడంతో ఆయనకు విషం ఇచ్చి చంపారన్న అనుమానాలు బలపడ్డాయి. మణి మృతి వెనుక అతడి స్నేహితుల హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి.

మణి స్నేహితులకు నార్కో ఎనాలిసిస్‌ పరీక్షలు నిర్వహించినా పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. దీంతో సీబీఐ దర్యాప్తుకు మణి కుటుంబ సభ్యులు పట్టుపట్టారు. మరోవైపు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ మణి సోదరుడు ఆర్ఎల్వీ రామకృష్ణన్‌ మూడు రోజుల పాటు నిరాహారదీక్ష చేశారు. పోలీసులు సరిగా దర్యాప్తు చేపట్టలేదని ఆయన ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement