దుబాయ్లో ఘోరం జరిగింది. ఓ ఆకాశ హర్మ్యంలోని 11వ అంతస్థు నుంచి పడి భారత దేశానికి చెందిన తల్లీబిడ్డలు మరణించారు.
దుబాయ్లో ఘోరం జరిగింది. ఓ ఆకాశ హర్మ్యంలోని 11వ అంతస్థు నుంచి పడి భారత దేశానికి చెందిన తల్లీబిడ్డలు మరణించారు. ఈ సంఘటనలో మృతురాలి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మన్హట్టన్ టవర్స్లో మంగళవారం ఉదయం ఈ సంఘటన జరిగినట్లు దుబాయ్ పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అధినేత బ్రిగెడియర్ ఒమర్ అల్ షమ్సీ తెలిపారు. అంత చిన్నపిల్ల కూడా అంత ఎత్తు నుంచి పడిపోయి చనిపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తోందని, సంఘటన గురించి చెప్పడానికి నోట మాటలు రావట్లేదని అదే భవనంలో నివాసం ఉండే ఓ వ్యక్తి చెప్పారు. ఇలాంటిది ఎప్పుడూ చూడకూడదని, పగవాడికి కూడా అలాంటి కష్టం రాకూడదని అన్నారు.
తల్లీ బిడ్డలు బాల్కనీ నుంచి పడిపోయి చనిపోయే సమయానికి భర్త కూడా ఇంట్లోనే ఉన్నాడు. ప్రస్తుతం అతడు పోలీసు కస్టడీలో ఉన్నాడు. దాదాపు ఏడాది కాలం నుంచి ఆ కుటుంబం అదే భవనంలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీఐడీ విభాగం అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య లేఖ ఏదీ కూడా ఇంట్లో లేనందున అది ఆత్మహత్య కాకపోవచ్చని భావిస్తున్నారు. వాళ్లు ప్రమాదవశాత్తు పడిపోయారా లేక ఇందులో ఏమైనా కుట్ర ఉందా అనే విషయాలు దర్యాప్తు తర్వాతే తేలాల్సి ఉంది.