ఐదునెలలుగా కారిడార్లోనే పాఠాలు.. | In this Delhi school, classes are in corridors and kids take turns to sit | Sakshi
Sakshi News home page

ఐదునెలలుగా కారిడార్లోనే పాఠాలు..

Jul 17 2016 4:27 PM | Updated on Jul 26 2019 6:25 PM

నగరంలోని సోనియా విహార్ ప్రభుత్వ సెకండరీ పాఠశాల దుస్థితి మాటల్లో చెప్పేది కాదు.

న్యూఢిల్లీ: నగరంలోని సోనియా విహార్ ప్రభుత్వ సెకండరీ పాఠశాల దుస్థితి మాటల్లో చెప్పేది కాదు. గత ఐదు నెలలుగా పాఠశాల కోసం కొత్త భవనాలను నిర్మిస్తుండగా కనీసం చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రం చేయకుండా ఉంచడంతో పాఠశాల ఆవరణం మురికివాడలా మారిపోయింది. టాయిలెట్స్ కూడా నిర్మాణ దశలోనే ఉండటంతో పిల్లలు బహిరంగంగా మలమూత్ర విసర్జనలు చేస్తున్నారు. దీంతో స్కూల్ ఆవరణ మొత్తం కంపు కొడుతోంది.

పాఠశాలలో ఉన్న మొత్తం 150 మంది విద్యార్ధులకు చదువు చెప్పేందుకు వేరే సదుపాయాలు ఏమీ కల్పించకపోవడంతో కారిడార్లలోనే ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. చాలా కొద్ది ప్రాంతంలోనే 95 మందికి పైగా విద్యార్థులను చిన్న ప్రాంతంలో కూర్చొబెట్టి పాఠాలు బోధించడం ఇబ్బందికరంగా ఉంటోందని ఓ టీచర్ చెప్పారు. భవనాలు నిర్మాణంలో ఉండటంతో అక్కడి నుంచి వచ్చే శబ్దాల కారణంగా క్లాసులు సజావుగా సాగడం లేదని తెలిపారు.

తరగతులు సజావుగా సాగేందుకు పాఠశాలలో గదులు లేనందున రోజు విడిచి రోజు క్లాసులను నడుపుతున్నట్లు చెప్పారు. గత గురువారం రోజు విడిచి రోజు నిర్వహిస్తున్న క్లాసులను నిలిపివేయాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందనీ, సోనియా విహార్ కు ఆరు కిలో మీటర్ల విస్తీర్ణంలో మరో ప్రభుత్వ పాఠశాల అందుబాటులో లేదని తెలిపారు. కొత్త బిల్డింగ్ నిర్మాణం స్కూల్ కు ఉన్న ప్లే గ్రౌండ్ కూడా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పాఠశాలలో టీచర్ల కొరత కూడా అధికంగా ఉందని చెప్పారు. మొత్తం 45 రెగ్యులర్ టీచర్లు, 35 గెస్ట్ టీచర్లు పాఠశాలకు అందుబాటు ఉండాలని తెలిపారు. కానీ టీచర్ల సంఖ్య తక్కువగా ఉండటంతో మధ్యాహ్నం 03.30 నిమిషాలకే పిల్లలందరూ రోడ్ల మీదకు వెళ్లిపోతున్నట్లు వివరించారు. దీంతో పాఠశాలకు పిల్లల్ని పంపాలంటే వారి భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు భయపడుతున్నారని చెప్పారు. ఈ విషయంపై కొద్దిమంది తల్లిదండ్రులు హైకోర్టులో కేసు వేయగా.. కోర్టు ప్రభుత్వాన్ని సమాధానం కోరింది. ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణపనులు పూర్తయితే అన్నీ సర్దుకుంటాయని డీఈవో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement