సీబీఐ అధికారులమంటూ మోసం | hyderabad police arrested cheaters who told themselves as CBI officers | Sakshi
Sakshi News home page

సీబీఐ అధికారులమంటూ మోసం

Jul 16 2016 7:23 PM | Updated on Sep 4 2017 5:01 AM

సీబీఐ అధికారినంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తితో పాటు అతనికి సహకరించిన ముగ్గురిని సంతోష్‌నగర్ పోలీసులు పట్టుకున్నారు.

హైదరాబాద్: సీబీఐ అధికారినంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తితో పాటు అతనికి సహకరించిన ముగ్గురిని సంతోష్‌నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఏసీపీ వి. శ్రీనివాసులు, ఇన్‌స్పెక్టర్ ఎం. శంకర్‌తో తెలిపిన వివరాలివి... కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన హులిరాజ్ గౌడ్ ఆలియాస్ అలీ ఆలియాస్ సికిందర్ అలీ (51) నగరంలో సీబీఐ అధికారినంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. ఇతడు అంబర్‌పేట్ ఎంసీహెచ్ కాలనీకి చెందిన సయ్యద్ మస్తాన్ అలీ (45), యాకుత్‌పురాకు చెందిన సయ్యద్ మసూద్ అలీ హష్మీ ఆలియాస్ నవాజ్ (26), నర్కీ పూల్‌బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖాజా పాషా ఆలియాస్ బాబా (46)లతో కలిసి భూకబ్జాలు, వివాదాలు, ఇతర సెటిల్‌మెంట్‌లు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.

ఇందులో భాగంగా సంతోష్‌నగర్ రాజనర్సింహానగర్ కాలనీకి చెందిన సయ్యద్ నజఫ్ మోహీనుద్దీన్ ఆలియాస్ సైఫుద్దీన్ (82)కు బాలాపూర్ ప్రాంతంలో ఇంటి స్థలం ఉంది. కాగా, ఈ ప్లాట్ గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న సికిందర్ అలీ తాను సీబీఐ డిప్యూటీ డెరైక్టర్ అంటూ ఢిల్లీ నుంచి వచ్చానని సైఫుద్దీన్‌ను బుట్టలో వేసుకునానడు. వివాదాన్ని పరిష్కరించేందుకంటూ అతని నుంచి రూ.50 వేలు తీసుకున్నాడు. అయితే, సమస్యను పరిష్కరించకుండా నాన్చుతున్నాడు. ఇదేమనిప్రశ్నిస్తే అసభ్యంగా మాట్లాడాడు. దీంతో బాధితుడు సైపుద్దీన్ సంతోష్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులు నయాపూల్‌లో ఉన్నట్లు సమాచారం అందుకుని శుక్రవారం రాత్రి దాడి చేశారు. నకిలీ అధికారిగా చెలామణి అవుతున్న సికిందర్ అలీ సహా నలుగురినీ అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.10 వేలను స్వాధీనం చేసుకొని శనివారం రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement