
ఆమె భయపడినట్టే జరిగింది..
ఉత్తరప్రదేశ్లో లైంగికదాడి బాధితురాలిపై నిందితులు కాల్పులు జరిపారు.
మీరట్: ఉత్తరప్రదేశ్లో లైంగికదాడి బాధితురాలిపై నిందితులు కాల్పులు జరిపారు. బాధితురాలు ముజఫర్ నగర్ కోర్టుకు వెళ్తుండగా దుండగులు మోటార్ బైకులపై వచ్చి కాల్చారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
ఈ ఏడాది జనవరిలో ముజఫర్ నగర్ జిల్లాలోని ఓ గ్రామంలో నలుగురు దుండగులు బాధిత మహిళపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు.. నిందితుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాల్సిందిగా మొరపెట్టుకుంది. కేసు నమోదు చేసేందుకు మొదట నిరాకరించిన పోలీసులు.. బాధితురాలు కోర్టుకు వెళ్లడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఆమె భయపడినట్టుగానే పది నెలల తర్వాత నిందితులు మరో ఇద్దరితో కలసి హత్యాయత్నం చేశారు. కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా ఆమెను బెదిరిస్తూ దుర్భాషలాడారు. బాధితురాలు ఒప్పుకోకపోవడంతో కాల్పులు జరిపారు. కాల్పుల శబ్ధం విని స్థానికులు అక్కడికి చేరుకోగా నిందితులు పరారయ్యారు. ఆమె శరీరంలోకి మూడు బుల్లెట్లు దిగాయి. బాధితురాలిని మీరట్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.