'జనతా గ్యారేజ్‌' స్టార్‌కు ఏనుగు దంతాల షాక్‌! | Court orders probe against Mohanlal | Sakshi
Sakshi News home page

'జనతా గ్యారేజ్‌' స్టార్‌కు ఏనుగు దంతాల షాక్‌!

Oct 15 2016 6:10 PM | Updated on Sep 4 2017 5:19 PM

'జనతా గ్యారేజ్‌' స్టార్‌కు ఏనుగు దంతాల షాక్‌!

'జనతా గ్యారేజ్‌' స్టార్‌కు ఏనుగు దంతాల షాక్‌!

'జనతా గ్యారేజ్‌', 'మనమంతా' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ను ఏనుగుదంతాల కేసు వెంటాడుతోంది.

కోచి: 'జనతా గ్యారేజ్‌', 'మనమంతా' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ను ఏనుగుదంతాల కేసు వెంటాడుతోంది. ఆయన ఏనుగు దంతాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై దర్యాప్తు జరపాలని కోచి కోర్టు శనివారం విజిలెన్స్‌ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. మోహన్‌ లాల్‌ అక్రమంగా ఏనుగు దంతాలు కలిగి ఉన్నారంటూ హక్కుల కార్యకర్త ఏఏ పౌలాస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన మువత్తుపుళా విజిలెన్స్‌ కోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి నవంబర్‌ 28లోగా దర్యాప్తు నివేదిక తమకు సమర్పించాలని ఆదేశించింది.

2011లో మోహన్‌లాల్‌ ఇంట్లో ఆదాయపన్ను అధికారులు సోదాలు జరిపినప్పుడు తొలిసారిగా ఆయన వద్ద ఏనుగు దంతాలు ఉన్నాయనే విషయం వెలుగుచూసింది. 2012లో ఆయనపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. అప్పట్లో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదైంది. అయితే, తాను ఏనుగు దంతాలు కొనుగోలు చేసినట్టు మోహన్‌లాల్‌ చెప్తున్నారు. వన్యప్రాణి, అటవీ చట్టం ప్రకారం ఎవరైనా ఏనుగు దంతాలు కలిగి ఉండటం అక్రమం. ఈ వ్యవహారంలో అటవీ అధికారులు సక్రమంగా పనిచేయడం లేదని, కావాలనే ఉద్దేశపూర్వకంగా మోహన్‌లాల్‌ను కేసు నుంచి తప్పించేలా ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ పిటిషనర్‌ కోర్టును ఆశ్రయించాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement