లోక్సభ నుంచి 25 మంది తమ పార్టీ ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ నేతృత్వంలో...
న్యూఢిల్లీ: లోక్సభ నుంచి 25 మంది తమ పార్టీ ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ నేతృత్వంలో ఆ పార్టీ నాయకులు ధర్నా చేయడాన్ని అధికార బీజేపీ తప్పుపట్టింది. కాంగ్రెస్ను విధ్వంసక విపక్ష పార్టీగా అభివర్ణిస్తూ బీజేపీ పార్లమెంటరీ పార్టీ మంగళవారం తీర్మానం చేసింది. అభివృద్ధి నిరోధక విధానాలకు పాల్పడుతూ ఆటంకవాదిగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది.
పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద తమ పార్టీ నాయకులతో కలసి ధర్నా నిర్వహించిన సోనియా... ప్రజాస్వామ్యంలో ఇదొక బ్లాక్ డే అని మండిపడటాన్ని బీజేపీ ఆక్షేపించింది. నిరాధార ఆరోపణలతో సుష్మ, రాజే, శివరాజ్సింగ్ చౌహాన్ల రాజీనామాకు డిమాండ్ చేయడం శోచనీయమని తీర్మానంలో పేర్కొంది. తమ పార్లమెంటరీ పార్టీ ఆ ముగ్గురికి అండగా ఉంటుందని పునరుద్ఘాటించింది. మంగళవారమిక్కడ జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ప్రధాని మోదీతోపాటు మంత్రులు హాజరయ్యారు.