తెలంగాణ బిల్లు చర్చ తేదీపై బీఏసీదే తుది నిర్ణయం | Business Advisory Committee take decision on Telangana bill: Nadendla Manohar | Sakshi
Sakshi News home page

తెలంగాణ బిల్లు చర్చ తేదీపై బీఏసీదే తుది నిర్ణయం

Dec 5 2013 2:40 AM | Updated on Sep 27 2018 5:59 PM

రాష్ట్ర విభజన వ్యవహారం నేపథ్యంలో ఈనెల 12వ తేదీ నుంచి జరుగనున్న శాసనసభ సమావేశాలు ఎన్నడూ లేనంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి.

బీఏసీని సమావేశపర్చనున్న స్పీకర్ నాదెండ్ల
టీ బిల్లుపై చర్చకు ప్రభుత్వం రాష్ట్రపతిని అదనపు సమయం కోరే అవకాశం

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన వ్యవహారం నేపథ్యంలో ఈనెల 12వ తేదీ నుంచి జరుగనున్న శాసనసభ సమావేశాలు ఎన్నడూ లేనంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. తెలంగాణ ముసాయిదా బిల్లు ఈ సమావేశాల్లోనే అసెంబ్లీ అభిప్రాయానికి వస్తుందా? లేదా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ అసెంబ్లీ సమావేశాలు మూడు నుంచి అయిదురోజుల పాటు జరగవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే శాసనసభా వ్యవహారాల సలహా సంఘం సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, అందులో వచ్చే సూచనలను అనుసరించే అసెంబ్లీ సమావేశపు రోజులుంటాయని శాసనసభ వర్గాలు పేర్కొంటున్నాయి.
 
అలాగే సభలోపల చర్చించాల్సిన అంశాలపై కూడా బీఏసీనే తుది నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. అయితే ఇదంతా నిబంధనలను అనుసరించి బయటకు చెబుతున్న విధివిధానాలు మాత్రమే. అంతర్గతంగా కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాలను అనుసరించే అసెంబ్లీ సమావేశాలు సాగనున్నాయి. అసెంబ్లీ భేటీ అయిదు రోజులకే పరిమితమైతే ప్రస్తుత సమావేశాల్లో తెలంగాణ బిల్లు చర్చకు రావడం కష్టమన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. అయితే అంతిమంగా కేంద్రం కాంగ్రెస్ పార్టీ వేసే అడుగులపైనే అసెంబ్లీకి తెలంగాణ బిల్లు రావడం, దానిపై చర్చ జరిగే తీరు ఆధారపడనుంది. కాగా రాష్ట్రపతి నుంచి ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వస్తే... స్పీకర్ సభావ్యవహారాల సలహా సంఘాన్ని సమావేశపరుస్తారని, ఆ భేటీలో తీసుకొనే తేదీలో బిల్లును అసెంబ్లీలో చర్చకు పెడతారని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి.
 
అయితే ప్రస్తుత సమావేశాల్లోపు రాష్ట్రపతినుంచి ముసాయిదా బిల్లు అసెంబ్లీకి వస్తే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేదీ ఆసక్తికరంగానే మారుతోంది. కీలకమైన విభజన బిల్లుపై కూలంకషంగా చర్చించి, అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున సభలో అభిప్రాయసేకరణకు తగినంత గడువు కావాలని రాష్ట్రపతికి విన్నవించాలని సీఎం కిరణ్ భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులంటున్నారు. ప్రభుత్వ వినతిపై రాష్ట్రపతినుంచి వచ్చే స్పందనను అనుసరించి టీ ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చ ఆధారపడనుందని అసెంబ్లీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు తేదీలు ఖరారవ్వడంతో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. విభజన అంశం ఇరుపా్రంతాల్లోనూ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసే పరి స్థితి ఉండడం, దాని ప్రభావం అసెంబ్లీపై పడే అవకాశం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement