ఉచితాలపై పవన్‌, నాదెండ్ల కొత్త పాట.. ఏకిపారేసిన నెటిజన్లు | Netizens Serious On Pawan Kalyan And Nadendla Manohar Over Freebies And Welfare Promises | Sakshi
Sakshi News home page

ఉచితాలపై పవన్‌, నాదెండ్ల కొత్త పాట.. ఏకిపారేసిన నెటిజన్లు

Oct 13 2025 7:27 AM | Updated on Oct 13 2025 10:06 AM

Netizens Serious On Pawan Kalyan And Nadendla Manohar

సాక్షి, అమరావతి: ‘యువత ఉచితాలను అడగడం లేదు. సంక్షేమ పథకాలను కోరుకో­వడం లేదు.’ అని జనసేన అ­ధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ పేర్కొన్నారు. తిత్లీ తుపాను సమయంలో 2018 అక్టోబర్‌ 12వ తేదీన పవన్‌ కళ్యాణ్‌తో కలిసి తాను శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన విషయా­లను గుర్తు చేసుకుంటూ జనసేనకు చెందిన మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఆదివారం ‘ఎక్స్‌’లో ఒక పోస్టు పెట్టారు.

ఈ క్రమంలో దానికి కొందరు యువతతో కూర్చుని మాట్లాడుతున్న ఫొటో­ను జత చేశారు. ఆ పోస్టును ట్యాగ్‌ చేస్తూ పవన్‌ కళ్యాణ్‌ స్పందించారు. ‘ఆ పర్యటనలో మేం అక్కడివారితో జరిపిన సంభాషణ నాకు చాలా స్పష్టంగా గుర్తుంది. వారు ఉచితాలను అడగలేదు. వారు ఎటువంటి సంక్షేమ పథకాలనూ అడగలేదు. కానీ, వారు మాకు 25 సంవత్సరాల భవిష్యత్తును ఇవ్వండి.. ఉచితాలను కాదని గట్టిగా చెప్పారు. మన యువత నిజమైన సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకోవాలి. వారి కలలను నెరవేర్చడం కోసం వారిని అర్థం చేసుకోవడానికి నేను యువతను కలుస్తూనే ఉంటాను’ అని పవన్‌కళ్యాణ్‌ తన పోస్టులో పేర్కొన్నారు.

నెటిజన్ల ప్రశ్నలు..
పవన్‌ కళ్యాణ్‌ ‘ఎక్స్‌’లో పెట్టిన పోస్టుపై పలువురు ప్రతిస్పందించారు. ‘యువత ఉచిత, సంక్షేమ పథకాలు కోరుకోకపోతే గత ఎన్నికల ముందు టీడీపీ కూటమి భాగస్వామిగా ఉన్న జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో ఎందుకు ఉచిత పథకాలు అమలు చేస్తామని హామీలు ఇచ్చారు? ప్రతి సంవత్సరం రూ.1.2లక్షల కోట్లు ఖర్చయ్యే సంక్షేమ, ఉచిత పథకాలను అమలు చేస్తామని ఎందుకు ప్రచారం చేశారు..? అంటూ పలువురు పవన్‌కళ్యాణ్‌ పోస్టుపై స్పందిస్తూ రీ పోస్టులు పెట్టారు. ఎన్నికల సమయంలో పవన్‌కళ్యాణ్‌ యువతకు ప్రత్యేకంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 మంది చొప్పున యువ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రూ.15 లక్షల చొప్పున ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నిస్తూ కొందరు పోస్టు చేశారు. 

 

 

మరోవైపు ఎన్నికల ముందు టీడీపీ–జనసేన కూటమిని గెలిపిస్తే నాటి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తామని, వాటి కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని, పది రూపాయలను అదనంగా ఇస్తామని చెప్పా­రు.ఈ విషయం పదే పదే ప్రజలకు చెప్పాలని జనసేన కార్యాలయంలో 2024 ఫిబ్రవరిలో సమావేశం ఏర్పాటు చేసి తమ పార్టీ  శ్రేణులకు హితబోధ చేశారు. టీడీపీ నాయకత్వంతో మాట్లాడి డ్వాక్రా రుణాలను ఎలా మాఫీ చేయాలనే అంశంపై అధ్యయనం చేస్తామని, పెద్దపెద్ద కంపెనీలు బ్యాంకులను మోసం చేస్తే ఉదారంగా వదిలేస్తున్నారని పవన్‌కళ్యాణ్‌ చెప్పారు. ఇలాంటి హామీలన్నింటినీ ప్రశ్నిస్తూ పలువురు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement