‘అమితాబ్, జయ వేర్వేరుగా ఉంటున్నారు’ | Sakshi
Sakshi News home page

‘అమితాబ్, జయ వేర్వేరుగా ఉంటున్నారు’

Published Tue, Jan 24 2017 10:30 AM

‘అమితాబ్, జయ వేర్వేరుగా ఉంటున్నారు’

ముంబై: సమాజ్ వాదీ పార్టీలో పరివార్ సంక్షోభానికి కారణమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్యసభ సభ్యుడు అమర్‌ సింగ్ మరో బాంబు పేల్చారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌, ఆయన భార్య జయాబచ్చన్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయని వెల్లడించారు. అంతేకాదు వారిద్దరూ వేర్వేరుగా నివసిస్తున్నారని తెలిపారు. అత్తాకోడళ్లు జయాబచ్చన్, ఐశ్వర్యరాయ్ కు పడడంలేదని అమర్ సింగ్‌ చెప్పినట్టు ‘ఏబీపీ మజ్హా’  వార్తా సంస్థ పేర్కొంది.

ప్రతి విషయంలో గొడవలకు తానే కారణం అన్నట్టుగా మీడియా చూపుతుందని ఆయన వాపోతూ... ‘నేను అమితాబ్‌, జయబచ్చన్‌ లను కలిసే నాటికి వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఒకరు ప్రతీక్షలో ఉంటే, మరొకరు జానక్‌ లో నివసిస్తున్నారు. జయ, ఐశ్వర్యరాయ్ మధ్య కూడా విభేదాలు వచ్చినట్టు ఊహాగానాలు వచ్చాయి. దీనికి నేను బాద్యుడిని కాద’ని అన్నారు.

సమాజ్‌ వాదీ పార్టీలో చేరొద్దని జయను అమితాబ్ హెచ్చరించారని గతంలో అమర్ సింగ్ చెప్పారు. మొదట్లో అమర్ సింగ్‌ తో సన్నిహితంగా మెలగిన అమితాబ్‌ తర్వాత ఆయనను దూరం పెట్టారు. అమర్ సింగ్ వ్యాఖ్యలపై బచ్చన్‌ కుటుంబం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement