అనిల్ అంబానీ గ్రూప్ సంస్థ రిలయన్స్ క్యాపిటల్ వ్యవసాయ రంగ బీమా బిజినెస్లోకి ప్రవేశించింది. అనుబంధ బీమా సంస్థ రిలయన్స్ జనరల్ ద్వారా దేశవ్యాప్తంగా రైతులకు పంటల బీమాను అందించనుంది.
న్యూఢిల్లీ: అనిల్ అంబానీ గ్రూప్ సంస్థ రిలయన్స్ క్యాపిటల్ వ్యవసాయ రంగ బీమా బిజినెస్లోకి ప్రవేశించింది. అనుబంధ బీమా సంస్థ రిలయన్స్ జనరల్ ద్వారా దేశవ్యాప్తంగా రైతులకు పంటల బీమాను అందించనుంది. వాతావరణ మార్పులు తదితర కారణాలవల్ల వాటిల్లే పంట నష్టాలకుగాను రైతులకు బీమా పరిహారాన్ని చెల్లించేందుకు వీలుగా వివిధ పథకాలను ప్రవేశపెట్టింది. వాతావరణం, పంట దిగుబడి ఆధారిత బీమా పథకాలను ప్రవేశపెట్టడం ద్వారా దేశీయ వ్యవసాయ రంగంలోకి తొలి అడుగు వేశామని రిలయన్స్ జనరల్ సీఈవో రాకేష్ జైన్ పేర్కొన్నారు. 21 రాష్ట్రాలలో వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వంనుంచి కంపెనీ అనుమతి పొందింది. పథకాలలో భాగంగా అతివృష్టి(అధిక వర్షపాతం), లేదా అనావృష్టి(వర్షాల కొరత)లతోపాటు శీతోష్ణస్థితుల్లో కలిగే మార్పుల వల్ల పంటలకు నష్టం వాటిల్లితే బీమా పరిహారాన్ని అందజేయనుంది.