ఇల్లు మారిన షీలా దీక్షిత్ | After losing power, Sheila Dikshit shifts to rented house | Sakshi
Sakshi News home page

ఇల్లు మారిన షీలా దీక్షిత్

Feb 11 2014 10:57 AM | Updated on Sep 2 2017 3:35 AM

న్యూఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్

న్యూఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్

హస్తిన శాసనసభకు జరిగిన ఎన్నికలలో 'ఆప్' కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఘోర పరాజయం పాలైన న్యూఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఎట్టకేలకు ఇల్లు మారారు.

హస్తిన శాసనసభకు జరిగిన ఎన్నికలలో 'ఆప్' కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఘోర పరాజయం పాలైన న్యూఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఎట్టకేలకు  ఇల్లు మారారు. మెతీలాల్ మార్గ్లోని 2.5 ఎకరాలలోని అత్యంత విశాలమైన ఆరు బెడ్ రూమ్లు గల ఫ్లాట్ నుంచి మధ్య ఢిల్లీలోని ఫిరోజ్ షా ప్రాంతంలోని సిల్వర్ ఆర్క్ అపార్ట్మెంట్లో్కి ఐదవ అంతస్తులో ఆమె నివసించనున్నారు. ఆ ఆపార్ట్మెంట్ వైశాల్యం ఎంతో తెలుసా అక్షరాల 2 వేల చదరపు గజాలు. ఆ అపార్ట్మెంట్లోని  మూడు గదులు గల ఆ ఇంట్లో ఒకటి షీలా పడక గదిగా మార్చారు. మరోకటి కార్యాలయం కోసం, మిగిలిన గదిని గ్రంధాలయం, వచ్చే అతిధుల కోసం వినియోగించనున్నారు. ఇప్పటికే షీలాకు చెందిన సామానంతా సిల్వర్ ఆర్క్ అపార్ట్మెంట్లో పని వారు పొందికగా  అమర్చారు.



దక్షిణ ఢిల్లీలోని తూర్పు నిజాముద్దీన్ ప్రాంతంలో షీలాకు సొంత ఇల్లు ఉంది. అయితే ఆ నివాసంలోకి వెళ్లేందుకు ఆమెకు సుతారాము ఇష్ట పడటం లేదు. ఆ ఇంట్లో ఎలివేటర్ లేకపోవడమే కాకుండా ఆమె హుద్రోగ వ్యాధిగ్రస్తురాలు. అంతేకాకుండా షీలాకు బైపాస్ సర్జరీ జరిగింది. దాంతో ఆమె మెట్లు ఎక్కలేదు. దీంతో షీలా సిల్వర్ ఆర్క్ అపార్ట్మెంట్ వైపే మొగ్గు చూపినట్లు స్థానిక మీడియా సంస్థ మంగళవారం వెల్లడించింది.  అయితేఆ అపార్ట్మెంట్లో కేవలం 11 నెలలు మాత్రమే నివసించేందుకు కాంట్రాక్ట్ అగ్రిమెంట్పై షీలా సంతకం చేయడం గమనార్హం.

 

వరుసగా మూడు సార్లు న్యూఢిల్లీ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ సాధించిన షీలా దీక్షిత్ గతేడాది చివరలో ఆ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. దాంతో ముఖ్యమంత్రి పీఠాన్ని షీలా వదులుకోవాల్సి వచ్చింది. గతంలో ఆమె సీఎంగా ఉన్న సమయంలో జరిగిన అవినీతిపై విచారణకు 'ఆప్' ప్రభుత్వం ఇప్పటికే సమాయిత్తమైన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement