స్వాతంత్య్ర పూర్వం నుంచీ..! | A history of accords but peace has eluded Nagaland | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర పూర్వం నుంచీ..!

Aug 4 2015 3:15 AM | Updated on Sep 3 2017 6:43 AM

స్వాతంత్య్రానికి ముందు రోజుల్లో నాగా ప్రాంతాన్ని భారత్‌లో కలపవద్దంటూ నాగా నేతలు బ్రిటిష్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

నాగా తిరుగుబాటు నేపథ్యం
న్యూఢిల్లీ: స్వాతంత్య్రానికి ముందు రోజుల్లో నాగా ప్రాంతాన్ని భారత్‌లో కలపవద్దంటూ నాగా నేతలు బ్రిటిష్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈశాన్య రాష్ట్రాల్లో, ప్రస్తుత మయన్మార్‌లోని ఉత్తర ప్రాంతంలో నాగా ప్రజల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాలను కలిపి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని ఉద్యమించారు.
 
ఫిజో నేతృత్వం: 1918లో కొంతమంది నాగా యువకులు కోహిమాలో నాగా క్లబ్‌ను ఏర్పాటు చేశారు. రాజ్యాంగ ప్రక్రియలో నాగా ప్రాంతాలను భాగం చేయవద్దంటూ సైమన్ కమిషన్‌ను కోరారు. నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మయన్మార్‌ల్లో నాగాలున్న ప్రాంతాన్ని స్వతంత్ర దేశాంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో అంగమి నాయకత్వంలో 1946లో నాగాలాండ్ నేషనల్ కౌన్సిల్(ఎన్‌ఎన్‌సీ) ఏర్పాటైంది.  1947 ఆగస్ట్ 14న ఫిజో ఆ ప్రాంతాలను కలిపి స్వతంత్ర దేశంగా ప్రకటించారు. దాంతో ఫిజోను 1948లో కేంద్రం అరెస్ట్ చేసింది. విడుదలైన తరువాత ఫిజో ఎన్‌ఎన్‌సీ అధ్యక్షుడయ్యారు. 1952లో  నెహ్రూతో చర్చలు విఫలమవడంతో, సాయుధ పోరాటం ప్రారంభించారు. ఆ పోరాటాన్ని భారత ప్రభుత్వం అణచివేయడంతో తొలుత బంగ్లాదేశ్‌కు ఆ తరువాత లండన్‌కు పారిపోయారు. అక్కడే 1990లో చనిపోయారు. నాగా గెరిల్లాల ఆధ్వర్యంలో ఇక్కడ సమాంతర ప్రభుత్వం మొదలైంది.
 
షిల్లాంగ్ ఒప్పందం: 1975లో భారత ప్రభుత్వం, ఎన్‌ఎన్‌సీల మధ్య ‘షిల్లాంగ్ ఒప్పందం’ కుదిరింది. అయితే, ఆ ఒప్పందాన్ని ఎన్‌ఎన్‌సీలోని అతివాద బృందాల వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో 1980లో ఇసాక్, మ్వివ, ఖప్లాంగ్ నేతృత్వంలో ఎన్‌ఎస్‌సీఎన్ ఏర్పడింది. 1988లో ఆ సంస్థ రెండుగా విడిపోయింది. ఎన్‌ఎస్‌సీఎన్(ఐఎమ్), ఎన్‌ఎస్‌సీఎన్(కే) ఏర్పాడ్డాయి.
 
సమాంతర ప్రభుత్వం: తిరుగుబాటును ఎన్‌ఎస్‌సీఎన్(ఐఎమ్) తీవ్రం చేసింది. ప్రాబల్య ప్రాంతాలను 11 భాగాలుగా విభజించి, ‘గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ నాగాలాండ్’గా  సమాంతర ప్రభుత్వాన్ని నడపసాగింది. తీవ్రవాద సంస్థలతో బంధాలు ఏర్పాటు చేసుకుంది.  చైనా, పాక్‌ల నుంచి అన్నిరకాల సాయం వీరికి లభిస్తోందన్న సమాచారాన్ని కేంద్రం సంపాదించింది. చిన్నాచితకా తిరుగుబాటు సంస్థలు రంగంలోకి దిగి అక్రమంగా పన్నుల సేకరణ, వ్యతిరేకులను దారుణంగా హతమార్చడం, బలవంతపు నగదు వసూళ్లువంటి పనులతో భయోత్పాతం సృష్టించసాగాయి. ఈ నేపథ్యంలో... శాంతే లక్ష్యంగా భారత్ ప్రభుత్వం ఆ సంస్థతో కుదుర్చుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement