కుటుంబ తగాదాల నేపథ్యంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అయితే అతడు కనిపించకుండాపోయాడని కుటుంబసభ్యులు గత మూడు నెలలుగా వెతుకుతున్నారు.
చేవెళ్ల (రంగారెడ్డి) : కుటుంబ తగాదాల నేపథ్యంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అయితే అతడు కనిపించకుండాపోయాడని కుటుంబసభ్యులు గత మూడు నెలలుగా వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో నిందితుల్లో ఒకరు తాగిన మైకంలో తాము పాల్పడిన ఘోరాన్ని వెల్లడి చేయటంతో నిజం బహిర్గతమైంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం రావులపల్లికి చెందిన కావలి పాండు, పావని దంపతులకు ఒక కుమారుడు మహేందర్(18), కుమార్తె ఉన్నారు. మహేందర్ వ్యవసాయ పనుల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అయితే వ్యవసాయ భూములకు సంబంధించి గత కొన్నేళ్లుగా వారి దాయాది అయిన లచ్చయ్యతో విభేదాలున్నాయి.
ఇలా ఉండగా, గత జూలై 19వ తేదీన లచ్చయ్య సాయం కావాలంటూ మహేందర్ను పొలానికి పిలుచుకు వెళ్లాడు. మరో వ్యక్తిని వెంట తీసుకువచ్చిన లచ్చయ్య... పొలంలోనే మహేందర్ను పారతో కొట్టి చంపాడు. అనంతరం ఇద్దరూ కలసి అతడిని అక్కడే గుంత తవ్వి పాతిపెట్టారు. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. కాగా రెండు రోజుల క్రితం తాగిన మైకంలో ఉన్న సమయంలో లచ్చయ్య తోటి వారితో మహేందర్ కోసం వెతకటం దండగని.. అతని చనిపోయాడని నోరుజారాడు. ఆ సంగతి కాస్తా మహేందర్ కుటుంబసభ్యులకు తెలిసింది. దీంతో అప్పటికే లచ్చయ్యపై ఉన్న అనుమానం బలపడింది.
ఆదివారం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు లచ్చయ్యను స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. విచారణలో తాము పాల్పడిన ఘోరాన్ని ఒప్పుకున్నాడు. సోమవారం ఉదయం సీఐ ఉపేందర్, ఎస్సై రాజశేఖర్, తహశీల్దార్ వెంకట్రెడ్డి, వైద్యుడు శివబాలాజీ రెడ్డి తమ సిబ్బందితో గ్రామానికి చేరుకుని మహేందర్ను పాతిపెట్టిన చోటులో జేసీబీతో తవ్వించారు. మిగిలిన ఎముకల గూడుకు అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. తలపై బలమైన గాయం కావటం వల్లే మహేందర్ చనిపోయాడని వైద్యులు తేల్చారు.