ఎన్నికల్లో సత్తా చూపుతాం | Sakshi
Sakshi News home page

ఎన్నికల్లో సత్తా చూపుతాం

Published Tue, May 1 2018 2:08 AM

We will showcase our strength in the election - Sakshi

జనగామ: ప్రభుత్వం రేషన్‌ డీలర్ల సమస్యలు పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో తమ ప్రతాపం చూపుతామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేశ్‌బాబు హెచ్చరించారు. సోమవారం జనగామ జిల్లా కేంద్రంలో జరిగిన రాష్ట్ర స్థాయి రేషన్‌ డీలర్ల అధ్యక్ష, కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గౌరవ వేతనంపై స్పష్టమైన ప్రకటన చేయని పక్షంలో వచ్చే పంచాయతీ ఎన్నికలతోపాటు సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఈ పాస్‌ ద్వారా బియ్యం పంపిణీ చేస్తూ, రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన ఘనత తమకే దక్కుతుందని చెప్పారు. నెలకు రూ.30 వేల గౌరవ వేతనంతోపాటు హెల్త్‌ కార్డులు, ప్రభుత్వ పథకాలు వర్తింపజేసే విధంగా ప్రకటన చేయాలని కోరారు. నాలుగేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.400 కోట్లు, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన రూ.20.19 కోట్లను వెంటనే విడుదల చేయాలన్నారు. వే బ్రిడ్జిపై కాంటా వేసిన తర్వాతనే ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి డీలర్‌కు బియ్యాన్ని పంపించాలని సూచించారు. త్వరలో హైదరాబాద్‌ లేదా వరంగల్‌లో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో జూలై ఒకటి నుంచి నిరవధిక బంద్‌ పాటిస్తూ, తిరుగుబాటు చేయాలని తీర్మానం చేశారు.

Advertisement
Advertisement