అడవుల రక్షణపై అటవీ శాఖ మరింత దృష్టి సారించింది.
దండేపల్లి: అడవుల రక్షణపై అటవీ శాఖ మరింత దృష్టి సారించింది. అడవుల్లో నిఘా పెంచేందుకు వాచ్టవర్ల నిర్మాణాలు చేపడుతోంది. జన్నారం అటవీ డివిజన్లో ఇప్పటికే దొంగపల్లి, గండిగోపాల్రావ్పేట, ఉడుంపూర్, అల్లంపల్లిలో వాచ్ టవర్లు నిర్మించింది. తాజాగా కవ్వాల్తోపాటు దండేపల్లి సమీపంలోని ఊట్ల మలుపుల వద్ద వాచ్ టవర్ నిర్మాణం చేపడుతోంది. దీంతో ఈ ప్రాంతంలో కలప అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడనుంది. అడవుల రక్షణలో వాచ్టవర్లు ఎంతగానో ఉపయోగపడతాయి. టవర్లు ఎక్కి పరిశీలిస్తే అడవిలో ఎక్కడా ఏం జరుగుతున్నా తెలుసుకోవచ్చు.
కలప అక్రమ రవాణా, వన్యప్రాణుల పరిశీలన, వేసవిలో అడవుల్లో మంటలు చెలరేగిన ప్రాంతాలను గుర్తించి అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే వీలుంటుంది. తాళ్లపేట, తిర్యాణి అటవీ రేంజిల సరిహద్దు ప్రాంతమైన ఊట్ల రెండో మలుపు వద్ద చేపడుతున్న వాచ్ టవర్ నిర్మాణం పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఊట్ల అటవీ ప్రాతంలో ఇప్పటికే చాలామంది పర్యాటకులు వస్తుంటారు. వాచ్ టవర్ నిర్మాణం పూర్తయితే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.