తెలంగాణ ప్రభుత్వం రైతుకు ప్రోత్సాహకంగా లీటరుకు రూ. 4 పెంచడంతో విజయ డెయిరీ పాల సేకరణ గణనీయంగా పెరిగింది.
* 40వేల లీటర్ల పాలు అదనంగా సేకరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతుకు ప్రోత్సాహకంగా లీటరుకు రూ. 4 పెంచడంతో విజయ డెయిరీ పాల సేకరణ గణనీయంగా పెరిగింది. అధికారుల అంచనా ప్రకారం మొదటి వారంలోనే ఏకంగా 40వేల లీటర్ల అదనపు సేకరణ జరుగుతోందని సమాచారం. ప్రైవేటు డెయిరీలు మార్కెట్ను ముంచెత్తుతోన్న నేపథ్యంలో ఈ పరిణామం విజయ డెయిరీకి ఊరట కలిగించే అంశం. ప్రస్తుతం విజయ డెయిరీ రాష్ట్రంలో లక్షన్నర లీటర్ల పాలను సేకరిస్తోంది.
కర్ణాటక నుంచి మరో లక్ష లీటర్లు సేకరిస్తోంది. ప్రోత్సాహకం ప్రకటించిన తర్వాత రైతుల నుంచి వచ్చిన సహకారంతో వారంలోనే అదనంగా 40 వేల లీటర్లు పెరిగిం దని విజయ డెయిరీ అధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ఇప్పటివరకు విజయ డెయిరీ రైతుకు లీటరుకు రూ. 53 చెల్లించేది. ప్రభుత్వ ప్రోత్సాహకంతో అది రూ.57కు చేరుకుంది. హెరిటేజ్ పాలను కేరళ ప్రభుత్వం నిషేధించడంతో విజయ పాలపై వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారని ఆ అధికారి చెప్పారు. రానున్న రోజుల్లో మరో 3 లక్షల లీటర్ల సేకరణ లక్ష్యంగా ప్రణాళిక రచించినట్లు తెలిపారు.