విషాదం నింపిన ఈత సరదా
బావిలో మునిగి ఇద్దరు చిన్నారుల మృతి
గొల్లపల్లి (వెల్గటూర్): ఈత సరదా ఇద్దరు చిన్నారులను బలిగొన్నది. ఈ ఘటన బుధవారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పైడిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపురం (బీ–జోన్)కు చెందిన వాసాల లక్ష్మణ్–స్వరూప దంపతులకు ఛత్రపతి(10), కూతురు ఉన్నారు. ఛత్రపతి నాలుగో తరగతి చదువుకుంటున్నాడు.
పైడిపల్లిలోని అమ్మమ్మ పెరుక పోచమ్మ ఇంటికి పది రోజుల క్రితం వచ్చాడు. ఇతనికి పైడిపల్లికే చెందిన పెరుమాండ్ల నర్సయ్య–మరియ దంపతుల కుమారుడు హర్షవర్ధన్(8)తో స్నేహం పెరిగింది. బుధవారం సాయంత్రం గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ బావి వద్దకు ఈతకని వెళ్లారు. ఈత రాకపోవడంతో బావిలోకి దిగిన వెంటనే నీటిలో మునిగి చనిపోయారు.