పోలీసుల అదుపులో టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి!
ఊట్కూర్ (మక్తల్): మావోయిస్టులతో పరిచయాలున్నాయన్న అనుమానంతో మక్తల్కు చెందిన తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటిని శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ విద్యానగర్లోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలిసింది. ఆయన నుంచి సెల్ఫోన్లు, వివిధ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం మక్తల్లో ఉన్న తల్లి వెంకటమ్మ, ఇతర కుటుంబసభ్యులకు ఆదివారం తెలియడంతో ఆందోళన చెందుతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్కు చెందిన శంకరప్ప, వెంకటమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు కాగా రెండో కుమారుడు మద్దిలేటి ఉద్యమ బాటలో పయనించారు. మద్దిలేటి భార్యాపిల్లలతో హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. అక్కడే న్యాయవాది పరీక్షకు శిక్షణ పొందుతున్నారు. రాష్ట్రంలో విద్యార్థి దశ నుంచి ఉద్యమ బాటలో పయనించిన ఆయన చురుకైన కార్యకర్తగా పనిచేస్తూ టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. దీంతో ఆయన కదలికలపై పోలీసులు నిఘా వేయగా మావోలతో పరిచయాలు ఉన్నాయని అనుమానంతో పోలీసులు అదుపులో తీసుకున్నారు.