ఉద్రిక్తం: జేఏసీ నేతల హౌస్‌ అరెస్ట్‌ | TSRTC Strike: JAC Leaders House Arrest | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తం: ఆర్టీసీ జేఏసీ నేతల హౌస్‌ అరెస్ట్‌

Nov 16 2019 9:24 AM | Updated on Nov 16 2019 3:53 PM

TSRTC Strike: JAC Leaders House Arrest - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల జేఏసీ శనివారం తలపెట్టిన బస్‌రోకో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. కార్మికులు కార్యక్రమానికి పోలీసు శాఖ నుంచి అనుమతులు రాలేదు. దీంతో ఆర్టీసీ జేఏసీ నేతలు పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు. ఇప్పటికే జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డిని బీఎన్‌రెడ్డి నగర్‌లో హౌస్‌ అరెస్ట్‌ చేసిన పోలీసులు.. మరోనేత రాజిరెడ్డి సైతం గృహ నిర్బంధం చేశారు. నేతల ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు వారి ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరకుంటున్నారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అయితే బస్‌రోకోకు ఎలాంటి అనుమతి లేదని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ప్రకటించిన నేపథ్యంలో ముందస్తుగానే పలువురు నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్‌ల పరంపర కొనసాగుతోంది.

దీనిపై సిటీ సీపీ అంజనీ కుమార్‌ మాట్లాడుతూ.. నగరంలోని బస్‌ భవన్‌తో పాటు డిపోల వద్ద 500 మీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. ఇది శనివారం తెల్లవారుజామున 3గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 3గంటల వరకు వర్తిస్తుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రూపులుగా ఏర్పడి ఆందోళన చేయొద్దని, బస్సుల రాకపోకలు అడ్డుకుంటే ఉపేక్షించబోమన్నారు. నగరంలో ఇలాంటి చర్యల వల్ల విద్య, వ్యాపార కార్యకలాపాలకు ఇబ్బందులు కలుగుతాయని, నిబంధనలు పాటించాలని సూచించారు.


Advertisement
 
Advertisement
Advertisement