ఆర్టీసీ సమ్మె : మంత్రి పువ్వాడకు గవర్నర్ ఫోన్
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఆరా తీశారు. ఈ మేరకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్తో ఫోన్లో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రితో చర్చించారు. కార్మికుల డిమాండ్లను వివరించడానికి గవర్నర్ వద్దకు రవాణాశాఖ కార్యదర్శిని మంత్రి పంపించారు. త్వరలోనే మంత్రి అజయ్ గవర్నర్ను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, సమ్మె ప్రభావం, విద్యాసంస్థలకు దసరా సెలవుల పొడగింపు తదితర అంశాలపై గవర్నర్ ఆరా తీసినట్లు సమాచారం. కాగా తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 13వ రోజు కూడా కొనసాగుతోంది.