ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

TSRTC Strike: CM KCR Review Meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి ఆర్టీసీ సమ్మెపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ  సమావేశానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సోమవారం హైకోర్టులో విచారణ నేపథ్యంలో ప్రైవేటీకరణపై న్యాయస్థానం వ్యాఖ్యలు, కార్మికుల మిలియన్‌ మార్చ్‌ తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాగా రాష్ట్రంలో 5,100 రూట్లను ప్రైవేటీకరించాలన్న మంత్రిమండలి నిర్ణయాన్ని హైకోర్టు ఆక్షేపించిన విషయం తెలిసిందే. 

అయితే ఈ నెల 11న కోర్టులో వాదనలు ఉన్నందున అనసరించాల్సిన తీరుపై సీఎం మళ్లీ సమీక్ష జరుపుతున్నారు. తదుపరి విచారణలో వాటిపై వ్యవహరించాల్సిన తీరుపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 36వ రోజు కూడా కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. ఇక ఆర్టీసీ కార్మికుల మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో విధించిన ట్రాఫిక్‌ ఆంక్షలను పోలీసులు ఎత్తివేశారు. వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చి బారికేడ్లను తొలగించారు.

చదవండిపోలీసులపై ఆందోళనకారుల రాళ్లదాడి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top