తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద ఉద్రిక్తత

TSRTC Employees Reached Deport Try To Join Duty - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు సమ్మె విరమించి, విధుల్లోకి చేరేందుకు డిపోల వద్దకు వెళ్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆర్టీసీ యాజమాన్యం అనుమతి లేనందున విధుల్లో చేరడం కుదరంటూ కార్మికులను వెనక్కి పంపివేస్తున్నారు. ఇప్పటికే పలువురు  జేఏసీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిపోల వద్దకు చేరుకున్న కార్మికులు.. తాత్కాలిక కండక్టర్లను, డ్రైవర్లను అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులు కార్మికులను అరెస్ట్‌ చేస్తున్నారు. పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగాయి. 

కరీంనగర్‌ డిపో వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విధుల్లో చేరేందుకు వచ్చిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కార్మికులకు మద్దతుగా వచ్చిన సీపీఐ కార్యకర్తలను సైతం అదుపులోకి తీసుకున్నారు. విధుల్లో చేరుందుకు వచ్చిన సంగారెడ్డి కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 

కామారెడ్డి డిపోలోకి ఆర్టీసీ కార్మికులు దూసుకువచ్చారు. తమను విధుల్లోకి చేర్చుకోవాలంటూ అధికారులలో వాగ్వివాదానికి దిగారు.దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 100 మంది కార్మికులతో పాటు మహిళా కండక్టర‍్లను అరెస్ట్‌ చేశారు. 

నిజామాబాద్‌ 1 డిపో వద్ద విధుల్లో చేరేందుకు వచ్చిన ఏడుగురు ఆర్టీసీ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమను విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు వేడుకున్నారు. కేసీఆర్‌కు దండం పెడుతున్నాము..దయచేసి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని కోరారు. తమ ఇళ్లల్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేవని, కుటుంబ పోషణ కూడా కష్టంగా ఉందంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

నాగర్‌కర్నూల్‌ ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విధుల్లోకి చేరడానికి ఆర్టీసీ కార్మికులు ర్యాలీగా బయలుదేరి డిపోలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకొని ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేశారు. ఈ తరుణంలో పోలీసులకు, ఆర్టీసీ కార్మికుల మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం జరిగింది. కార్మికులను పోలీసు స్టేషన్‌కు తరలిస్తున్న వాహనాన్ని మహిళా కండక్టర్లు అడ్డుకున్నారు. 

మహబూబ్‌నగర్‌ జిల్లావ్యాప్తంగా  డిపోల వద్ద ఉద్రిక‍్తత నెలకొంది. విధుల్లోకి చేరేందుకు కార్మికులు అన్ని డిపోలకు వెళ్లారు. డిపో లోపలికి వెళ్లేందుకు యత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. 23 మంది కార్మికులను అరెస్ట్‌ చేశారు. నాగర్‌ కర్నూల్‌, కల్వకుర్తి డిపోల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. నారాయణ పేట డిపోవద్ద ధర్నాకు దిగిన కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాత్కాలిక సిబ్బందితో బస్సులను నడిపిస్తున్నారు. 

భద్రాద్రి కొత్తగూడెం డిపో వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డిపోకి చేరుకున్న కార్మికులు.. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను అడ్డుకున్నారు. దీంతో కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిపో వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. 

నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నార్కట్‌పల్లి, దేవరకొండ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట, కోదాడ ఆర్టీసీ కార్మికులను అరెస్ట్‌ చేశారు.

మెదక్‌ జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. సంగారెడ్డి డిపో వద్ద విధుల్లోకి చేరేందుకు యత్నించిన కార్మికును పోలీసులు అరెస్ట్‌ చేశారు. సిద్దిపేట డిపో వద్ద పోలీసులకు, కార్మికుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. విధుల్లోకి చేరేందుకు వచ్చిన కార్మికులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్‌ చేశారు.  

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ ఆర్టీసీ డిపో వద్దకు పోలీసులకు, కార్మికుల మధ్య తోపులాట జరిగింది. విధులకు హాజరవుతామంటూ కార్మికులు డిపోలోకి చొచ్చుకొచ్చారు. తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదంటూ అధికారులు వారిని విధుల్లోకి తీసుకోలేదు. దీంతో వారు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకొని కార్మికులు అదుపులోకి తీసుకున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top