గిరిజన సంక్షేమ శాఖలో..కామాటీ కథ! | Tribal Welfare Department Kamati story | Sakshi
Sakshi News home page

గిరిజన సంక్షేమ శాఖలో..కామాటీ కథ!

Jul 9 2015 3:07 AM | Updated on Sep 3 2017 5:08 AM

జిల్లా గిరిజన సంక్షేమశాఖలో దళారుల దందా సాగుతోంది. గిరిజన కార్మికుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి ఉద్యోగాలను

 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా గిరిజన సంక్షేమశాఖలో దళారుల దందా సాగుతోంది. గిరిజన కార్మికుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని చెప్పి కొందరు లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. దశాబ్దాలుగా దినసరి కార్మికులుగా పనిచేస్తున్న కామాటీలను రెగ్యులైరె జ్ చేసి టైంస్కేల్ కింద వేతనాలు ఇప్పించేందుకుగాను పేద గిరిజనుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఈ శాఖలో అనేక రకాల కార్యక్రమాల కోసం పలువురు దళారులుండగా, ఈసారి ఈ పనిని ఓ వ్యాపారికి అప్పజెప్పినట్టు తెలుస్తోంది. జిల్లా గిరిజన సంక్షేమశాఖలో ‘పెద్దన్న’ పాత్ర పోషిస్తోన్న ఈ వ్యాపారి మరికొందరు దళారుల సాయంతో ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నాడని తెలుస్తోంది. ఈయన తనకున్న పలుకుబడితో, కమిషనరేట్‌లో ఉన్న బడాబాబుల సాన్నిహిత్యంతో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక్కో పోస్టుకు రూ. 2లక్షల నుంచి రూ.4లక్షల వరకు గుంజుతున్నాడని  గిరిజన సంక్షేమ శాఖలో గుప్పుమంటోంది. అయినా అధికారులు మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
 
 అసలు కథ ఇది..
 గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో జిల్లా వ్యాప్తంగా ఉన్న హాస్టళ్లలో 66 మంది దశాబ్దాలుగా కామాటీలుగా పనిచేస్తున్నారు. వీరు 1980 సంవత్సరం తర్వాత పలుదఫాలుగా హాస్టళ్లలో నియమితులయ్యారు. హాస్టళ్లను శుభ్రంగా ఉంచడం, వంట సామాన్లు కడగడం, వంటమనిషి రానప్పుడు పిల్లలకు వంట చేసి పెట్టడం వీరి విధి దాదాపు 30 ఏళ్లకు పైగా పనిచేస్తున్న వీరికి వేతనం ఇంకా దినసరిగానే లెక్కించి చెల్లిస్తున్నారు. హాస్టళ్ల వార్డెన్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి వీరికి నెలకు రూ.3 వేల నుంచి రూ.5వేల వరకు వేతనం వస్తోంది. హాస్టళ్లలో గొడ్డుచాకిరీ చేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని ఈ కామాటీలు పలుమార్లు గిరిజన సంక్షేమ శాఖకు నెత్తీనోరు బాదుకుని చె ప్పుకున్నా ఫలితం లేకుండా పోయింది. నిబంధనల సాకుతో హైదరాబాద్‌లోని కమిషనర్ కార్యాలయం నుంచి వీరికి ఎప్పుడూ చుక్కెదురయ్యేది.
 
 అయితే, ప్రభుత్వంతో విసిగిపోయిన వీరిలో కొందరు ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ)ని ఆశ్రయించారు. వీరి వాదనలతో ఏకీభవించిన ట్రిబ్యునల్ వీరందరినీ రెగ్యులరైజ్ చేయకపోయినా కనీసం టైంస్కేల్ కింద ఉత్తర్వులు ఇవ్వాలని తీర్పునిచ్చింది. ఆ తీర్పు ఆధారంగా గతంలో 17 మందికి టైంస్కేల్ కింద వేతనాలిచ్చేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో మళ్లీ మరో 49 మంది అదే ట్రిబ్యునల్‌కు వెళ్లారు. వీరి వాదనలను కూడా సమంజసంగానే పరిగణించిన ట్రిబ్యునల్ వీరికి కూడా టైంస్కేల్ వేతనాలు వర్తింపజేయాలని ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వుల మేరకు సదరు కామాటీలు ఎప్పుడు నియమితులయ్యారు... వీరి వయస్సు ఎంత ఉంటుంది.. ఏ పద్ధతిలో వేతనాలు చెల్లిస్తున్నారు.. అనే విషయాలను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు హాస్టల్ వార్డెన్లకు గిరిజన సంక్షేమ శాఖ నుంచి ఉత్తర్వులు వెళ్లడంతో వార్డెన్లు ఈ పనిలో నిమగ్నమయ్యారు.
 
 ‘కథ’ మొదలైంది ఇలా...
 ఈ ఉత్తర్వులు వచ్చిందే తడవుగా గిరిజన సంక్షేమ శాఖలో అక్రమ వ్యాపారం మొదలయింది. నిరక్షరాస్యులైన గిరిజనులు హైదరాబాద్ వరకు వెళ్లి ఉత్తర్వులు తెచ్చుకునే పరిస్థితి ఉండదు కనుక, అక్కడ, ఇక్కడా ముట్టజెప్పాలనే సాకుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని నల్లగొండకు పిలి పించుకుని టైంస్కేల్ కింద వేతనాలు ఇప్పిస్తామని, ఇందుకు గాను ఖర్చులుంటాయని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.2లక్షల నుంచి రూ.4లక్షల వరకు తీసుకునేందుకు బేరసారాలు మొదలయ్యాయి. అయితే, ఈ ఉత్తర్వులు రావాలంటే ముందు జిల్లా కార్యాలయం ఫైల్ వె ళ్లాలని, ఇక్కడినుంచి వెళ్లేందుకు చాలా ఖర్చు అవుతుందని, మళ్లీ హైదరాబాద్‌లోని కమిషనరేట్ పెద్దలకు ముట్టజెప్పాల్సి ఉంటుందని చెప్పి ఈ మేరకు గుంజుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మరో విషయమేమిటంటే ఈ ఉత్తర్వులకు సంబంధించిన వ్యవహారాలు చూసే ఓ అధికారి ఆమ్యామ్యాలకు ఆశపడే వ్యక్తి కాకపోవడంతో ఆయనకు ఫైల్ ఇచ్చేందుకు అధికారులు వెనుకాముందు ఆడుతున్నట్టు గిరిజన సంక్షేమశాఖ కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన త్వరలోనే సెలవుపై వెళ్లే అవకాశం ఉన్నందున మరో వ్యక్తికి ఈ ఫైల్ వ్యవహారాలు కట్టబెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement