ఎన్జీటీలో ‘కాళేశ్వరం’పై విచారణ నేటికి వాయిదా  | Sakshi
Sakshi News home page

Published Wed, Oct 4 2017 12:58 AM

The trial on 'Kaleshwaram' was postponed for today - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ)లో జరుగుతున్న విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఎంతమేరకు అటవీ భూములను వినియోగిస్తున్నారో చెప్పాల్సిందిగా జస్టిస్‌ జావేద్‌ రహీమ్‌ నేతృత్వంలోని బెంచ్‌ గత విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై మంగళవారం ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అతి తక్కువ మేర అటవీ భూములున్నట్లు తెలిపింది. ప్రస్తుతం వాటిలో ఎలాంటి నిర్మాణాలు జరపడం లేదని, పూర్తి అనుమతులు వచ్చాకే ముందుకు సాగుతామని స్పష్టంచేసింది.

ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే అటవీ భూముల విషయంలోనూ అస్పష్టత ఉందని, పలు చోట్ల అటవీ భూములుగా చెబుతున్నవి రెవెన్యూ పరిధిలో ఉన్నాయని పేర్కొన్నట్టు సమాచారం. ఈ అఫిడవిట్‌పై కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా పిటిషనర్లను ఆదేశించిన బెంచ్‌ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. 
 

Advertisement
Advertisement