కాచిగూడ స్టేషన్‌లో రెండు రైళ్లు ఢీ

Trains Collide Near Kacheguda Railway Station - Sakshi

కర్నూలు–సికింద్రాబాద్‌ హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన ఎంఎంటీఎస్‌

ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రెండు రైళ్లు రావడంతో ప్రమాదం

గాలిలోకి ఎగిరి పట్టాల పైనుంచి పక్కన పడ్డ ఎంఎంటీఎస్‌ బోగీలు

దాదాపు 40 మందికి గాయాలు

ఇంటర్‌సిటీ ఇంజిన్‌ చొచ్చుకు రావడంతో ఇరుక్కుపోయిన ఎంఎంటీఎస్‌ లోకోపైలట్‌

8 గంటలపాటు శ్రమించి బయటకు తీసిన సహాయక బృందాలు

సాక్షి, హైదరాబాద్‌ : నిత్యం పలు రైళ్ల రాకపోకలతో రద్దీగా ఉండే హైదరాబాద్‌ కాచిగూడ రైల్వేస్టేషన్‌లో సోమవారం ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చి రెండు రైళ్లు ఢీకొన్నాయి. కర్నూలు–సికింద్రాబాద్‌ హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలును లింగంపల్లి–ఫలక్‌నుమా ఎంఎంటీఎస్‌ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది గాయపడ్డారు. స్టేషన్‌ కావడంతో రెండు రైళ్ల వేగం తక్కువగా ఉంది. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది.

ఒకవేళ రెండు రైళ్ల వేగం ఎక్కువగా ఉంటే ప్రమాద తీవ్రత మరింత పెరిగి భారీ ప్రాణనష్టం సంభవించి ఉండేది. ప్రాణనష్టం లేకపోవటంతో దీనిని చిన్న ప్రమాదంగానే పరిగణిస్తున్నా, ప్రమాదానికి దారితీసిన కారణాన్ని మాత్రం భారీ తప్పిదంగానే రైల్వే భావిస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే ఓ కమిటీ ఏర్పాటు చేసింది. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన రైల్వే సేఫ్టీ కమిషనర్‌ రాంక్రిపాల్‌ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ దర్యాప్తు చేపట్టనుంది.


నుజ్జునుజ్జయిన ఎంఎంటీఎస్‌ లోకోపైలట్‌ కేబిన్‌ (ఇన్‌సెట్‌లో) ప్రమాదంలో గాయపడిన పి.శేఖర్‌ 

ఏం జరిగింది?
కాచిగూడ స్టేషన్‌లోకి సోమవారం ఉదయం 10:20 గంటల సమయంలో లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్‌ రైలు రెండో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ పైకి వచ్చి ఆగింది. ప్రయాణికులు దిగిపోయిన తర్వాత సిగ్నల్‌ కోసం ఎదురుచూస్తోంది. అంతకు ముందే కర్నూలు టౌన్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ కాచిగూడ స్టేషన్‌ వద్దకు చేరుకుంది. అది మూడో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌లోకి వెళ్లాల్సి ఉంది. అది వచ్చిన సమయంలో మరో రైలు ఆ ప్రాంతాన్ని దాటాల్సి ఉండటంతో ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను హోం సిగ్నల్‌ ప్రాంతంలో ఆపి ఉంచారు. అది ఆగిన ప్రాంతం ప్లాట్‌ఫామ్‌కు 500 మీటర్ల దూరంలో ఉంటుంది. 10.30 గంటల సమయంలో దానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ప్రధాన లైన్‌ మీదుగా వచ్చినందున అది తొలుత ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ ట్రాక్, ఆ తర్వాత రెండో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ ట్రాక్‌లను దాటుకుని మూడో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌ ట్రాక్‌పైకి వెళ్లాలి. సిగ్నల్‌ పడగానే ఆ రైలు బయలుదేరి మొదటి ట్రాక్‌ను దాటి రెండో ట్రాక్‌పైకి వచ్చి దాన్ని క్రాస్‌ చేసేందుకు సిద్ధమవుతుండగా.. అప్పటికే రెండో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై నిలిచి ఉన్న ఎంఎంటీఎస్‌ రైలు ఫలక్‌నుమా వైపు ముందుకు కదిలింది. దాని లోకోపైలట్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆ ట్రాక్‌ మీదుగా మరో ట్రాక్‌లోకి క్రాస్‌ అవుతున్న సంగతిని గుర్తించలేదు. దీంతో ఎంఎంటీఎస్‌ నేరుగా దూసుకెళ్లి ఇంటర్‌సిటీ ఇంజిన్‌ను ఢీకొట్టింది.


ప్రమాదం జరిగింది ఇలా.. (సీసీ టీవీ దృశ్యాలు)

ఈ ఘటనలో ఇంటర్‌సిటీ రైలు ఇంజిన్‌ ఎంఎంటీఎస్‌ లోకోపైలట్‌ కేబిన్‌లోకి చొచ్చుకుపోయింది. ఎంఎంటీఎస్‌ తొలి నాలుగు బోగీలు ఎగిరి పట్టాల పక్కన పడిపోగా.. మరో రెండు బోగీలు పట్టాలు తప్పి పక్కకు ఒరిగిపోయాయి. ఇంటర్‌సిటీకి చెందిన మూడు బోగీలు సైతం పట్టాల నుంచి పక్కకు దిగిపోయాయి. ప్రమాద ఘటనలో ఎంఎంటీఎస్‌ ఒక్కసారిగా పెద్ద కుదుపుతో గాలిలోకి ఎగిరి కింద పడటంతో అందులో ఉన్న ప్రయాణికుల్లో దాదాపు 40 మందికి గాయాలయ్యాయి. బోగీ డోరు వద్ద ఉన్నవారు కొందరు కిందకు పడిపోయారు. ఘటన జరిగిన వెంటనే భయాందోళనలకు గురైన ప్రయాణికులు బోగీల నుంచి దూకి చెల్లాచెదురుగా పారిపోయారు. ఇంటర్‌సిటీ ఇంజిన్‌ చొచ్చుకెళ్లడంతో లోకోపైలట్‌ చంద్రశేఖర్‌ కేబిన్‌లోనే చిక్కుకుపోయారు. దాదాపు 8 గంటల తర్వాత ఎన్టీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఆయన్ను బయటకు తీసి, ఆస్పత్రికి తరలించారు.

వేగం తక్కువగా ఉండటంతో....
ప్రమాదం జరిగిన సమయంలో రెండు రైళ్ల వేగం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్టయింది. ట్రాక్‌ మారే ప్రయత్నంలో ఉన్నందున ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ వేగం 10 కిలోమీటర్ల లోపే ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఎంఎంటీఎస్‌ వేగం 15 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల మధ్య ఉందని రైల్వే చెప్పారు. సాధారణంగా ప్లాట్‌ఫామ్‌ నుంచి బయలు దేరి 500 మీటర్ల దూరం వచ్చేసరికి ఎంఎంటీఎస్‌ రైళ్ల వేగం దాదాపు 40 కిలోమీటర్ల వరకు చేరుకుంటుంది. కానీ ప్రమాదం జరిగిన ప్రాంతం ట్రాక్‌ ఛేంజింగ్‌ పాయింట్‌ కావటంతో అక్కడ వేగం అందులో సగానికి తక్కువే ఉంటుంది. ఇదే ఇక్కడ పెద్ద ప్రమాదాన్ని తప్పించింది.

ఉస్మానియా, కేర్‌లలో చికిత్స..
ప్రమాద ఘటనలో గాయపడినవారిలో కొందరు సమీపంలోని ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. కాస్త ఎక్కువ గాయాలైన 17 మందిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వారిలో 11 మందికి ఓపీలో చికిత్స చేసి పంపించగా.. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తున్నారు. పరకాలకు చెందిన పి.శేఖర్‌(36)కి తల, చేతులపై తీవ్ర గాయాలు కాగా, యాకుత్‌పురాకు చెందిన రహీమోద్దీన్‌(55)కి కూడా బలమైన గాయాలయ్యాయి. వీరికి ఉస్మానియాలో చికిత్స అందిస్తున్నారు. గద్వాలకు చెందిన బాలేశ్వరమ్మ(52)కు ఎడమ కాలు, హఫీజ్‌పేట్‌కు చెందిన రాజ్‌కుమార్‌(35)కు కుడికాలు విరిగిపోయాయి. వీరికి ఉస్మానియాలో కట్టు కట్టిన తర్వాత మెరుగైన వైద్యం కోసం నాంపల్లిలోని కేర్‌ ఆస్పత్రికి తరలించారు. లోకోపైలట్‌ చంద్రశేఖర్‌తోపాటు మరో క్షతగాత్రుడు సాజిద్‌ను కూడా కేర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్వల్ప గాయాలతో బయటపడిన సులోచన(32), ఆంజనేయులు(35), మహ్మద్‌ అలీ(45), ప్రభాకర్‌(65), రాజ్‌కుమార్‌(24), మౌనిక(18), అనురాధమ్మ(40), మీర్జాబేగం(46), బలరాం(45), మల్లమ్మ(50), ఆనంద్‌(25)లకు ఉస్మానియా ఓపీలో చికిత్స చేసి పంపించారు.

ప్రమాదం జరిగిన వెంటనే బోగీ నుంచి బయటకు దూకి పరుగులు తీస్తున్న ప్రయాణికులు

గవర్నర్‌ ఆరా...
రైలు ప్రమాదంలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆరా తీశారు. ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌కు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మరోవైపు రైల్వే అధికారులు ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురికి చికిత్స నిమిత్తం రూ.25 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. 

పెద్దశబ్దం వచ్చింది
రైళ్లు ఢీకొనగానే భారీగా శబ్దం వచ్చింది. ఏం జరిగిందో అర్థం కాలేదు. నేను మహిళా బోగీలో ఉన్నాను. అంతా హాహాకారాలు చేశారు. బోగీలో కొద్దిగా తొక్కిసలాట కూడా జరిగింది. వెంటనే తేరుకుని గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించాం.– ఆంజనేయరాజు, ఆర్పీఎఫ్‌

కొందరు బయటపడ్డారు
నేను మహిళా బోగీలో విధుల్లో ఉన్నాను. రైలు ఒక్కసారిగా ఆగిపోయింది. డోర్ల వద్ద నిలుచున్న చాలామంది ఎగిరి అవతల పడ్డారు. రైలు పట్టాలు తప్పిందని అర్థమైంది. నేను వెంటనే బోగీ నుంచి కిందకు దిగి, రైలు ఇంజిన్‌ వైపు పరిగెత్తాను. వెంటనే అంబులెన్స్‌కి ఫోన్‌ చేసి, అధికారులను అప్రమత్తం చేసాను. – ఎమ్మార్సీ రాజు, ఆర్పీఎఫ్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top