రైలు పట్టాలు రక్తసిక్తం... | Train tracks bleed | Sakshi
Sakshi News home page

రైలు పట్టాలు రక్తసిక్తం...

May 27 2015 1:19 AM | Updated on Sep 3 2017 2:44 AM

నగరంలోని రైలుపట్టాలు మంగళవారం రక్తసిక్తమయ్యాయి...

కాచిగూడ/ సికింద్రాబాద్: నగరంలోని రైలుపట్టాలు మంగళవారం రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో పట్టాలు దాటుతున్న ఇద్దరిని రైలు ఢీకొనడంతో మృతి చెందారు. రైలు ఢీకొని మేస్త్రీ మృతి చెందిన ఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. రైల్వే సీఐ లింగన్న కథనం ప్రకారం... వనస్థలిపురానికి చెందిన మేస్త్రీ చిలుక శ్రీరాం(45) కాచిగూడ - మలక్‌పేట రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరో ఘటనలో ఆటో డ్రైవర్....
అత్తవారింటికి వెళ్లి తిరిగి వస్తుండగా రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మంగళవారం సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.  జీఆర్‌పీ హెడ్‌కానిస్టేబుల్ సాహెబ్‌రావు కథనం ప్రకారం... నేరేడ్‌మెట్ వినాయక్‌నగర్‌కు చెందిన బుక్క లక్ష్మణ్ (35) ఆటో డ్రైవర్. ఇతను మద్యానికి బానిస కావడంతో ఆరేళ్ల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయిన భార్య కాపురానికి రావడంలేదు. కాగా, లక్ష్మణ్ సోమవారం మరోమారు అత్తగారింటి వెళ్లి భార్యను కాపురానికి రావాలని కోరగా ఆమె ససేమిరా అంది. తిరుగుప్రయాణంలో పీకలదాకా మద్యం తాగిన లక్ష్మణ్ మౌలాలి అమ్ముగూడ రైల్వేస్టేషన్‌ల పరిధిలో రైలు పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement