బోనాలు.. ట్రాఫిక్‌ ఆంక్షలు | Sakshi
Sakshi News home page

బోనాలు.. ట్రాఫిక్‌ ఆంక్షలు

Published Sat, Jul 20 2019 9:52 AM

Traffic Rules For Secunderabad Bonalu - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ నగర కొత్వాల్‌ అంజనీకుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆది, సోమవారాల్లో వివిధ సమయాల్లో, వివిధ ప్రాంతాల్లో ఇవి అమలులో ఉంటాయన్నారు. ఉత్సవాలకు హాజరయ్యే వారి కోసం ప్రత్యేక పార్కింగ్‌ స్థలాలనుకేటాయించారు.

ఆదివారం తెల్లవారుజాము 4 గంటల నుంచి
ఉజ్జయిని మహంకాళి పూజ ముగిసే వరకు టుబాకో బజార్‌ హిల్‌ స్ట్రీట్, జనరల్‌ బజార్, అదయ్య చౌరస్తాల నుంచి మహంకాళి దేవాలయం వరకు ఉన్న మార్గాల్లో ట్రాఫిక్‌ అనుమతించరు. బాటా చౌరస్తా నుంచి రామ్‌గోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ మధ్య ఉన్న సుభాస్‌ రోడ్‌ను వాహనాలకు మూసేస్తారు.  
కర్బలా మైదాన్‌ నుంచి రాణిగంజ్‌ చౌరస్తా వైపు వచ్చే ట్రాఫిక్‌ను మినిస్టర్స్‌ రోడ్, రసూల్‌పురా చౌరస్తా, సీటీఓ, ఎస్బీహెచ్‌ చౌరస్తా, వైఎంసీఏ చౌరస్తా, సెయింట్‌ జాన్స్‌ రోటరీ, గోపాలపురం లైన్, రైల్వేస్టేషన్‌ మీదుగా పంపిస్తారు.  
బైబిల్‌ హౌస్‌ వైపు నుంచి వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను ఘాస్‌మండి చౌరస్తా, సజన్‌లాల్‌ స్ట్రీట్‌ మీదుగా పంపిస్తారు.  
రైల్వేస్టేషన్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సుల్ని అల్ఫా హోటల్, గాంధీ ఎక్స్‌ రోడ్, మహంకాళి ఓల్డ్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్, ఘాస్‌మండి, బౌబిల్‌ హౌస్, కర్బాలా మైదాన్‌ మీదుగా పంపిస్తారు.  
రైల్వేస్టేషన్‌ నుంచి తాడ్‌బండ్, బేగంపేట వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను క్లాక్‌ టవర్, ప్యాట్నీ చౌరస్తా, వైఎంసీఏ చౌరస్తా, ఎస్బీహెచ్‌ చౌరస్తా మీదుగా మళ్లిస్తారు.  
ఎస్బీహెచ్‌ చౌరస్తా నుంచి ఆర్పీ రోడ్‌ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ప్యాట్నీ చౌరస్తా నుంచి క్లాక్‌ టవర్, ప్యారడైజ్‌ వైపు, ప్యారడైజ్‌ నుంచి ఆర్పీ రోడ్‌కు వచ్చే ట్రాఫిక్‌ను ప్యాట్నీ చౌరస్తా నుంచి ఎస్బీహెచ్, క్లాస్‌టవర్‌ వైపు పంపిస్తారు.
క్లాక్‌ టవర్‌ వైపు నుంచి ఆర్పీ రోడ్‌లోకి వెళ్లే ట్రాఫిక్‌ను ప్యాట్నీ చౌరస్తా ..ఎస్బీహెచ్‌ చౌరస్తా వైపు పంపిస్తారు.  
సీటీఓ జంక్షన్‌ నుంచి ఎంజీ రోడ్‌ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ప్యారడైజ్‌ చౌరస్తా నుంచి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సింధికాలనీ, మినిస్టర్స్‌ రోడ్, రాణిగంజ్‌ చౌరస్తా, కర్బాలా మైదాన్‌ వైపు, ప్యాట్నీ చౌరస్తా నుంచి వచ్చే ట్రాఫిక్‌ను ప్యారడైజ్‌ చౌరస్తా నుంచి సీటీఓ వైపు పంపిస్తారు.

సోమవారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 వరకు..
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్, సెయింట్‌ మేరీస్‌ రోడ్‌ మధ్య మార్గాన్ని పూర్తిగా మూసేస్తారు. హకీంపేట్, బోయిన్‌పల్లి, బాలానగర్, అమీర్‌పేట్‌ వైపుల  నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్‌కు వచ్చే బస్సుల్ని క్లాక్‌ టవర్‌ వరకే అనుమతిస్తారు. 

పార్కింగ్‌ ప్రాంతాలివే..  
సెయింట్‌ జాన్స్‌ రోటరీ, ఉప్‌కార్, ఎస్బీహెచ్‌ వైపు నుంచి వచ్చే వాహనాలకు హరిహర కళాభవన్, మహబూబియా కాలేజీ
కర్బాలా మైదాన్, బైబిల్‌ హౌస్, ఘాసీమండీ వైపు నుంచి వచ్చే వాహనాలకు ఇస్లామియా హైస్కూల్‌
రాణిగంజ్, ఆదయ్య చౌరస్తా వైపు నుంచి వచ్చే వాహనాలను ప్రభుత్వ ఆదయ్య మెమోరియల్‌ హైస్కూల్‌
సుభాష్‌ రోడ్‌ వైపు నుంచి వచ్చే వాహనాలకు పాత జైల్‌ఖానాలోని ప్రాంతం
మంజు థియేటర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలకు అంజలి థియేటర్‌  

మద్యం విక్రయాలపై కూడా..
ఉజ్జయినీ బోనాల నేపథ్యంలో ఉత్తర, మధ్య మండలాల్లోని కొన్ని ఠాణాల పరిధిలో మద్యం విక్రయాలు నిషేధిస్తూ కొత్వాల్‌ అంజనీకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6 నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు గోపాలపురం, చిక్కడపల్లి, లాలగూడ, తుకారాంగేట్, మహంకాళి, మార్కెట్, మారేడ్‌పల్లి, కార్ఖానా, బేగంపేట, తిరుమలగిరి, రామ్‌గోపాల్‌పేట్, గాంధీనగర్‌ ఠాణాల పరిధిలో ఇది అమల్లో ఉంటుంది. స్టార్‌ హోటల్స్‌ బార్లు, రిజిస్టర్డ్‌ క్లబ్బులకు మినహాయింపునిచ్చారు. 

Advertisement
Advertisement