హైదరాబాద్: సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 13న జరిగే తెలంగాణ లంబాడీల శంఖారావం బహిరంగ సభకు రాచకొండ ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. దిల్సుఖ్నగర్ మీదుగా నగరానికి చేరుకునే వారు ఎల్బీనగర్ వైపు రాకుండా ఇతర ప్రాంతాల నుంచి వాహనాలలో వెళ్లాలని సూచించారు. ఎల్బీనగర్ రింగురోడ్డు నుంచి మలక్పేట వైపు వెళ్లకుండా ఉప్పల్ ఎక్స్రోడ్డు, రామంతాపూర్ అంబర్పేట మీదుగా వెళ్లవచ్చని సూచించారు. లేదంటే సంతోష్నగర్, కర్మన్ఘాట్ మీదుగా వెళ్లవచ్చన్నారు. నగరానికి వెళ్లేవారు ఔటర్ రింగ్రోడ్డు నుంచి వెళ్లి తుక్కుగూడ, శంషాబాద్ మీదుగా నగరానికి చేరుకోవచ్చన్నారు. ఎల్బీనగర్ వైపు వచ్చే వాహనాలు సంతోష్నగర్ మీదుగా ఎల్బీనగర్ రింగురోడ్డు చేరుకోవచ్చని పేర్కొన్నారు. పలు మార్గాల గుండా వచ్చే వాహనాలకు పార్కింగ్ పాయింట్లను కేటాయించామని, ఎవరైనా నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
పార్కింగ్ పాయింట్లు ఇవే...
- వరంగల్ నుంచి వచ్చే వాహనాలు నాగోలు మెట్రో స్టేషన్లోని హెచ్ఎండీఏ లేఅవుట్లో పార్కింగ్ చేయాలి.
- విజయవాడ నుంచి వచ్చే వాహనాలు హెచ్ఎండీఏ లేఅవుట్ నాగోలులో పార్కు చేయాలి.
- ఇబ్రహీంపట్నం నుంచి వచ్చే వాహనాలు సాగర్ రహదారిపై ఉన్న ఫ్లైటెక్ ఏవియేషన్ మైదానంలో పార్క్ చేయాలి.
- కర్మన్ఘాట్ వైపు నుంచి వచ్చే వాహనాలు కర్మన్ఘాట్ ధ్యానాంజనేయస్వామి ఆలయం సమీపంలో పార్క్ చేయాలి.
- నగరం నుంచి వచ్చే వాహనాలు కొత్తపేటలోని వీఎం హోంలో పార్క్ చేయాలి.
- సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలు ఉప్పల్ క్రికెట్ స్టేడియం పరిసర ప్రాంతాలలో పార్క్ చేయాలి.
- ఎల్బీనగర్ వైపు వచ్చే వాహనాలు ఎల్బీనగర్లోని డీసీపీ కార్యాలయం సమీపంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పార్క్ చేయాలి.
లంబాడీ శంఖారావం.. ట్రాఫిక్ ఆంక్షలు
Dec 12 2017 1:15 AM | Updated on Dec 12 2017 1:15 AM
Advertisement


