నేడే ఓట్ల పండుగ | To day voters day | Sakshi
Sakshi News home page

నేడే ఓట్ల పండుగ

Apr 30 2014 3:24 AM | Updated on Sep 2 2017 6:42 AM

బీడీ కార్మికులు... నేత కార్మికులు... గల్ఫ్ బాధితుల కన్నీటి వెతలు... సింగరేణి కార్మికుల సమస్యలు... మెట్ట ప్రాంత రైతుల కష్టాలు... కడగండ్లు... ఈ ఎన్నికల్లో ఎంతమేరకు ప్రభావితం చేస్తాయి..? పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు ఎవరికి నష్టం చేస్తాయి..?

బీడీ కార్మికులు... నేత కార్మికులు... గల్ఫ్ బాధితుల కన్నీటి వెతలు... సింగరేణి కార్మికుల సమస్యలు... మెట్ట ప్రాంత రైతుల కష్టాలు... కడగండ్లు... ఈ ఎన్నికల్లో ఎంతమేరకు ప్రభావితం చేస్తాయి..? పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు ఎవరికి నష్టం చేస్తాయి..? ప్రారంభోత్సవానికి నోచుకోని ఎల్లంపల్లి భారీ నీటి పారుదల ప్రాజెక్టు.. పనులు మొదలు పెట్టని ప్రాణహిత-చేవెళ్ల, మధ్యలోనే ఆగిన మధ్య మానేరు, అర్ధంతరంగా ఆగిన వరద కాలువ, సుదూరంగా ఆగిన తోటపల్లి, గండిపల్లి రిజర్వాయర్లు, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు... నిర్వాసితుల సమస్యలు.. ఏ పార్టీకి పట్టం కడుతాయి..? ముందుకు సాగని ఇందూరు రైల్వే లైన్, తెరుచుకోని ఎఫ్‌సీఐ ఎరువుల కర్మాగారం... శిలాఫలకంతోనే ఆగిన నేదునూరు గ్యాస్ ఆధారిత విద్యుత్తు ప్రాజెక్టు... కరీంనగర్‌లో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ, ఐటీ పార్కు, కొత్త విద్యుత్తు ప్రాజెక్టులు... జిల్లా ప్రజల ఆశలు.. ఆకాంక్షలు.. ఎవరికి ఓటుబ్యాంకుగా మారుతాయి..? విస్తరణకు నోచుకోని రహదారులు.. కంకర తేలిన మారుమూల రోడ్లు... ఇప్పటికీ గొంతెండుతున్న పల్లెలు... వైద్య సేవలకు నోచుకోని తండాలు... వీటన్నింటిపై రోజుకో చోట అభ్యర్థులను నిగ్గదీసి నిలదీసిన ప్రజలు ఈసారి ఎవరిని అందలమెక్కిస్తారు..? తెలంగా టణ రాష్ట్ర వికాసం.. జన సంక్షేమమే ఎజెండాగా ఊదరగొట్టిన పార్టీల్లో ఏదీ బెటర్..? మీ ఎమ్మెల్యే.. ఎంపీ అభ్యర్థులు ఎలా ఉండాలి...? కొత్త రాష్ట్రం పగ్గాలు ఎవరి చేతిలో పెడుతారు..? ఓటర్లరా... మీరే నిర్ణయించుకోండి. నేడు పోలింగ్. నిరాసక్తత వీడండి. పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లండి... ఓటు మీ చేతిలో వజ్రాయుధం. అదే మీ పాశుపతాస్త్రం. ఆలోచించి ఓటెయ్యండి.      
 
 ఓటరు రారాజు రోజు వచ్చింది. ఐదేళ్ల తమ భవిష్యత్‌ను నిర్దేశించుకునే సమ యం ఆసన్నమైంది. నెల రోజుల పాటు ప్రచారాలు, ర్యాలీలు, ఊరేగింపులు, ప్రలోభాలతో హోరెత్తించిన అభ్యర్థుల తలరాతను నేడు ఓటర్లు రాయనున్నారు. ప్రచారం సాగినన్నాళ్లూ అందరికీ అభయమిచ్చిన ఓట రు దేవుళ్లు తమ నిర్ణయాన్ని నేడు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.
 
 
 జిల్లాలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు లోక్‌సభ స్థానాలకు బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నక్సల్ ప్రభావిత ప్రాంతమైన మంథని రెవెన్యూ డివిజన్‌లో సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో 168 మంది.. లోక్‌సభ స్ధానాల్లో 34 మంది బరిలో ఉన్నారు. ఓటరు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేసేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. కమ్యూనికేషన్ వ్యవస్థ లేకపోవడంతో మహదేవ్‌పూర్ మండల పరిధిలోని పది గ్రామాల్లో ‘హామ్’ రేడియో వ్యవస్థ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేసినా.. ఓటు ఎవరికి వేశారోనని ఆరా తీసినా కేసు నమోదు చే స్తామని అధికారులు హెచ్చరించారు.
 
 పోలింగ్ శాతం పెంపునకు చర్యలు
 సాధారణ ఎన్నికల్లో 90 శాతం పోలింగ్ నమోదయ్యేలా జిల్లా యంత్రాంగం ఓటుహక్కుపై విసృ్తత ప్రచారం కల్పిస్తోంది. 2009, ఏప్రిల్ 16న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 60 శాతం పోలింగ్ మాత్రమే నమోదు కాగా గత నెల 30న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 85 శాతం, ఈ నెల 6, 11 తేదీల్లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 83 శాతం పోలింగ్ నమోదైంది. ఇదే స్ఫూర్తితో జమిలీ ఎన్నికల్లో 90 శాతం పోలింగ్ జరిగేలా ప్రణాళికలు రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా  జరిగింది. దీంతో అధికారులు నేడు 90శాతం పోలింగ్ జరిగేలా చర్యలు తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 28,25,945 మంది ఓటర్లు బుధవారం ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 3,419 పోలింగ్ కేంద్రాల్లో 34,569 మంది సిబ్బందిని, 4 వేల మంది చొప్పున పీవోలు, ఏపీవోలు, 15,048 మంది ఇతర పోలింగ్ అధికారులతోపాటు ఇతర సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నట్లు కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య తెలిపారు. ఎన్నికల పర్యవేక్షణకు 428 మంది రూట్ మొబైల్స్‌ను, 26 బృందాలు స్ట్రైకింగ్, 13 ప్రత్యేక బలగాలను, 30 రోడ్డు ఓపెనింగ్ పార్టీలు, 43 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 62 మోడల్ కోడ్ కండక్ట్ (ఎంసీసీ) బృందాలను నియమించినట్లు వివరించారు.
 
 ఓటరుపైనే భారం
 నోటిఫికేషన్ విడుదలైనప్పటినుంచి అభ్యర్థులంతా ఓటరు బాట పట్టారు. నామినేషన్ వేసిన నుంచి పోటాపోటీ ప్రచారాలతో హోరెత్తించారు. పదిహేను రోజులపాటు అన్ని పార్టీల అధినేతలు, నాయకులు, అభ్యర్థులు విసృ్తత ప్రచారం నిర్వహించారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు అన్ని ఎత్తులు వేశారు. ప్రచారం ముగింపుదశకొచ్చే సరికి మద్యం ఏరులై పారించారు. విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేశారు. కొందరైతే ఆర్థికస్థోమత సహకరించకున్నా గెలుపుపై ఆశతో అప్పులు చేసి మరీ ప్రత్యర్థులకు దీటుగా ప్రచారం నిర్వహించారు. అందరికీ అభయం ఇచ్చిన ఓటరు దేవుడు తన ఆశీస్సులు ఎవరికందిస్తాడోననే ఉత్కంఠ అభ్యర్థుల్లో నెలకొంది.
 
 నోటా మీట..
 మునుపెన్నడూ లేని విధంగా.. కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారిగా ఈ ఎన్నికల్లో నోటా (తిరస్కరణ) ఓటు ప్రవేశపెట్టింది. బరిలో ఉన్న అభ్యర్థులు నచ్చక లక్షలాది మంది ఓటుకు దూరంగా ఉంటున్నారు. దీంతో తిరస్కరణ ఓటునూ ఎన్నికల సంఘం అమలు చేసింది. ఈవీఎంలో చివరి వరుస నంబర్‌ను నోటా కింద అమర్చారు. ఈ బటన్ నొక్కితే సదరు ఓటరు బరిలో ఉన్న అభ్యర్థులందరినీ తిరస్కరిస్తున్నట్లు అందులో ఫీడ్ అవుతుంది. అభ్యర్ధులు నచ్చకపోయినా ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి వచ్చి ‘నోటా’ బటన్ నొక్కాలని కలెక్టర్ వీరబ్రహ్మయ్య విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కుతోపాటు బాధ్యతగా భావించి అందరూ ఓటేయాలని కోరారు.
 
 ఏర్పాట్లు పూర్తి
 కరీంనగర్ : సాధారణ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎం.వీరబ్రహ్మయ్య చెప్పారు. నగరంలోని శ్రీరాజరాజేశ్వర డిగ్రీ కళాశాలలో ఎన్నికల సిబ్బందికి సామగ్రి పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, నీడ, ర్యాంప్‌లు తదితర మౌలిక అవసరాలు కల్పించినట్లు తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు కమ్యూనికేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పోలింగ్ 90 శాతం దాటేలా చర్యలు తీసుకున్నామని, ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు.
 
 మంథనిలో 5 వరకు..
 కలెక్టరేట్: మంథని నియోజకవర్గం పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి ఎం.వీరబ్రహ్మయ్య తెలిపారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉండగా... మంథని నియోజకవర్గానికి మాత్రం ఒక గంట పొడిగిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement