ఆర్టీసీ జేఏసీ మరోసారి కీలక భేటీ!

Telangana Medical Employees Support To The RTC Strike - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ శుక్రవారం ఉదయం 9 గంటలకు సమావేశం కానుంది. సమ్మెపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వ తీరుపై ఈ సమావేశంలో జేఏసీ నేతలు చర్చించనున్నారు. సమ్మెపై కోర్టు ప్రస్తావించిన పలు అంశాలపై జేఏసీ సమాలోచనలు చేయనున్నట్టు పేర్కొంది. సమావేశంలో ఈ నెల 19న ప్రకటించిన బంద్ విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై జేఏసీ నాయకులు చర్చ జరపనున్నారు.

ఇప్పటికే అన్ని వర్గాలు బంద్‌కు సహరిస్తామంటూ ప్రకటించాయని జేఏసీ తెలిపింది. తాజాగా ఆర్టీసీ కార్మికులకు న్యాయవాదులు, తెలంగాణ మెడికల్‌ ఉద్యోగుల జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపుతున‍్నట్టు ప్రకటించారు. అదేవిధంగా రేపు మధ్యాహ్నం 12 గంటలకు నాంపల్లి క్రిమినల్‌ కోర్టు నుంచి బస్‌భవన్‌ వరకు న్యాయవాదులు బైక్‌ ర్యాలీ చేపట్టనున్నట్టు తెలిపారు. కాగా ఉద్యోగ సంఘాలు కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలతో కలిసి వస్తాయని ప్రకటించడంతో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేలా రేపటి సమావేశంలో కార్యాచరణ రూపొందిస్తామని జేఏసీ నాయకులు పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top