
విమోచనం.. ఉద్రిక్తం
తెలంగాణ విమోచన దినోత్సవం బుధవారం జి ల్లాలో ఉద్రిక్తతల మధ్య కొనసాగింది.
- జిల్లా కేంద్రంలో పోలీసులు, బీజేపీ నాయకుల మధ్య తోపులాట
- నేతలను అరెస్టు చేసిన పోలీసులు
- జిల్లా అంతటా ప్రభుత్వ కార్యాలయాలపై రెపరెపలాడిన జాతీయ జెండా
ఆదిలాబాద్ టౌన్ : తెలంగాణ విమోచన దినోత్సవం బుధవారం జి ల్లాలో ఉద్రిక్తతల మధ్య కొనసాగింది. పార్టీలకతీతంగా వేడుకలు నిర్వహించగా.. ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండా రెపరెపలాడింది. పలు పార్టీల నేతలు తమ పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. బీజేపీ, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, టీఆర్ఎస్, ఏబీవీపీ, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో తోపులాట..
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయం, పోలీసు పరేడ్ మైదానంలో జాతీయ జెం డాను ఎగురవేసేందుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయ్యన్నగారి భూమయ్య ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్త లు ఆర్అండ్బీ విశ్రాంతి భవనం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేకుంది. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కొంత మంది కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయం గేటు నుంచి పెకైక్కి కార్యాలయంలోనికి చొరబడ్డారు. కార్యాలయం ముం దున్న పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీసుస్టేషన్కు తరలించారు. కలెక్టరేట్ ఎదుట జాతీయ జెండాను పట్టుకొని పరుగులు తీసిన బీజేపీ నాయకులను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. పోలీసు పరేడ్ మైదానం వైపు వెళ్లిన వారిని కూడా అరెస్టు చేశారు. ఇరువురి మధ్య కొంతసేపు తోపులాట జరిగింది.
జిల్లా అంతటా వేడుకలు..
ఆదిలాబాద్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. బీజేపీ ఆధ్వర్యంలో పట్టణంలోని నేతాజీ చౌక్లో నేతాజీ సుభాష్చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి జాతీయ జెండా ఎగురవేశారు. ర్యాలీలో బీజేపీ జిల్లా ఇన్చార్జి మురళీధర్గౌడ్, మాజీ అధ్యక్షుడు రావుల రాంనాథ్, పాయల శంకర్, సురేష్జోషి తదితరులు పాల్గొన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో విద్రోహ దినం సభలను జరిపారు. నిర్మల్లో తెలంగాణ విద్యావంతుల వేదిక భవనంలో జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విజయ్కుమార్, కృష్ణంరాజు పాల్గొన్నారు. నిర్మల భారతి సంస్థ ఆధ్వర్యంలో సాయుధ యోధుల సంస్మరణ స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో పరమేశ్వర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ, టీఆర్ఎస్, ఏబీవీపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఆసిఫాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు సురేష్బాబు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో అంబేద్కర్చౌక్లో జాతీయ జెండా ఎగురవేశారు. ముథోల్లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జాతీయ జెండా ఎగురవేశారు. తెలంగాణ గీతాన్ని ఆలపించారు. ఇందులో పార్టీ నాయకులు మురళీధర్గౌడ్, గంగారెడ్డి పాల్గొన్నారు. బెల్లంపల్లిలో బీజేపీ నాయకులు తహశీల్దార్ కార్యాలయంపై జాతీయ జెండా ఆవిష్కరించ్నారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. సీపీఐ, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాన్ని జరుపుకున్నారు. చెన్నూర్లో బీజేపీ నాయకులు తహశీల్దార్ కార్యాలయంపై జాతీయ జెండా ఎగురవేశారు.
తెలంగాణ గీతాన్ని ఆలపించారు. టీఆర్ఎస్, సీపీఐ నాయకులు సైతం విమోచన దినోత్సవాన్ని జరుపుకుని జాతీయ జెండాలను ఎగురవేశారు. కాగజ్నగర్లో మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ చైర్పర్సన్ విద్యావతి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో బాలభారతి జూనియర్ కళాశాలలో విమోచన దినోత్సవాన్ని జరుపుకున్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు. జిల్లా కేంద్రంలో మినహా మిగితా చోట్ల విమోచన దినోత్సవం ప్రశాంతంగా జరిగింది.
ప్రభుత్వ కార్యాలయాల వద్ద
పోలీసు బందోబస్తు..
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల ఎదుట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాలపై జెండాలను ఎగురవేయకుండా భద్రతా చర్యలు చేపట్టారు. కలెక్టరేట్, జెడ్పీ, పోలీసు పరేడ్ మైదానం, జిల్లా కోర్టు, తదితర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట పోలీసులు మోహరించారు.