రైతు కుటుంబాలను ఆదుకుంటున్నాం | telangana government reported high court for farmers | Sakshi
Sakshi News home page

రైతు కుటుంబాలను ఆదుకుంటున్నాం

Feb 1 2015 1:58 AM | Updated on Oct 1 2018 2:00 PM

ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.

హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం వివరణ


 సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ప్రభుత్వ పథకాల కింద ఆర్థిక సాయం, పెన్షన్ల మంజూరు వంటి తోడ్పాటు అందిస్తున్నామని వివరించిం ది. మెదక్ జిల్లాలో ఆత్మహత్యలకు పాల్పడిన 238 మంది రైతుల కుటుంబాలను గుర్తించి ఒక్కో కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా కింద రూ.లక్ష చెల్లించడంతో పాటు వన్ టైం సెటిల్‌మెంట్ కింద రూ.50 వేల వరకు రుణాలను మాఫీ చేశామని కోర్టుకు వివరించింది. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను ఆదుకోవడం లేదని మెదక్ జిల్లాకు చెందిన పాకాల శ్రీహరిరావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు ధర్మాసనం, ఎవరికైతే పరిహారాన్ని ఇవ్వలేదో వారికి పరిహారం అందచేయాలని, ఈ మొత్తం ప్రక్రియను ఆరు వారాల్లో పూర్తి చేయాలని ఇటీవల అధికారులను ఆదేశించింది.

 

అయితే ఈ ఆదేశాలను అమలు చేయలేదంటూ అధికారులపై శ్రీహరిరావు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన కోర్టు, ప్రతివాదిగా ఉన్న మెదక్ జిల్లా కలెక్టర్‌ను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కలెక్టర్ రాహుల్ బొజ్జా కౌంటర్ దాఖలు చేశారు. ధర్మాసనం ఆదేశాల మేరకు అర్హులను గుర్తించి, వారికి ప్రభుత్వ జీవో ప్రకారం అన్ని రకాల ప్రయోజనాలను అందచేశామని, ఈ విషయంలో పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కౌంటర్‌ను పరిశీలించిన ధర్మాసనం, సమాధానం ఇవ్వాలని పిటిషనర్ శ్రీహరిరావును ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement