పాటల తోటకి ప్రాణాంతక వ్యాధి.. | Sketch For Shalini Suffering With Blood Cancer | Sakshi
Sakshi News home page

మీ సాయం ఆమెకు ఊపిరి

May 25 2019 7:31 AM | Updated on May 29 2019 11:46 AM

Sketch For Shalini Suffering With Blood Cancer - Sakshi

షాలినీ (ఫైల్‌), షాలినీ ఇప్పుడిలా..

మొన్నటి దాకా తమతో సరదాగా నవ్వుతూ ఆనందంగాతిరిగిన తమ స్నేహితురాలు ఒక్కసారిగా ప్రాణాంతక వ్యాధి బారిన పడడంతోతట్టుకోలేకపోయారు ఆమె స్నేహితులు. ఆమెను ఎలాగైనా కాపాడుకోవాలని పరితపిస్తున్నారు. స్నేహితులు అంటే ఆట పాటల్లోనూ విందు వినోదాల్లో మాత్రమే కాదు.. ఆపత్కాలంలోనూ తోడుంటారని, బాసటగా నిలుస్తారని నిరూపిస్తున్నారు.

సాక్షి, సిటీబ్యూరో :‘ఎలాగైనా మా ఫ్రెండ్‌ని కాపాడుకోవాలి సర్‌. అదే మా ముందున్న లక్ష్యం’ అంటూ చెబుతున్న మణిరాజ్‌ను చూస్తే తమ స్నేహాన్ని నిలుపుకోవాలని మనసారా కష్టపడుతున్న నిజమైన ఫ్రెండ్‌కి ప్రతిరూపంలా కనపడతాడు. ‘చాలా మంచి అమ్మాయి సార్‌.. ఎంతో హ్యాపీగా ఉండేది. మాతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటుంది. దేవుడు ఆమెకి ఎందుకీ కష్టం ఇచ్చాడో’’ అని అంటున్నప్పుడు ఆధునిక యువతలో సెంటిమెంట్స్‌ కొరవడుతున్నాయనే మాట ఎంత తప్పో అర్థమవుతుంది.  

పాటల తోటకిప్రాణాంతక వ్యాధి
ఉప్పల్‌లో నివసించే షాలిని తల్లి దగ్గర ఉంటోంది. బి.ఆర్‌. అంబేడ్కర్‌ కాలేజీలో బీకామ్‌ కంప్యూటర్స్‌ రెండో ఏడాది చదవుతోంది. ఆటపాటల్లో బెస్ట్‌ అనిపించుకునే షాలిని స్నేహితులకు ఎంతో ఆప్తురాలు. ‘తను చాలా బాగా పాడుతుంది. గాయనిగా చాలా సర్టిఫికెట్లు కూడా అందుకుంది. ప్రదర్శనలు ఇచ్చింది. చాలా సరదాగా  యాక్టివ్‌గా ఉంటుంది’ అంటూ ఆమె గురించి చెప్పారు మిత్రబృందం. కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లినప్పుడు ఆమెకి బ్లడ్‌ కేన్సర్‌ అని డాక్టర్లు నిర్థారించారు. షాలినీ బతకాలంటే దాదాపు రూ.30 లక్షలు ఖర్చు అవుతుందన్నారు.

విద్యార్థుల విజ్ఞప్తికి ట్వీట్‌ చేసిన కేటీఆర్‌
ఈ మాట విని షాలిని తల్లి తల్లడిల్లిపోయింది. భర్తతో విడిపోయి ఒంటరిగా అద్దె ఇంట్లో నివసిస్తున్న ఓ ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్‌కి కూతురిని రక్షించుకోవడానికి అవసరమైన డబ్బు ఎలా తేవాలో అర్థం కాలేదు. ఆమెకి ఉన్న నగానట్రా అన్నీ అమ్మేస్తే వచ్చిన రూ.5 లక్షలు వైద్యం కోసం ఖర్చు చేశారు. ఇప్పుడు మరో రూ.25 లక్షలు అవసరం. అలాంటి సమయంలో ఈ స్నేహ బృందం మేమున్నామంటూ ముందుకొచ్చారు. షాలిని స్నేహితురాలు సరస్వతి, జనార్దన్‌ తదితరులు ఆమెను రక్షించుకునేందుకు నడుం కట్టారు. అంతా కలిసి రూ.2 లక్షల దాకా చందాలు వసూలు చేసి ఇచ్చారు. ప్లకార్డ్స్‌ పట్టుకుని తమ స్నేహితురాలిని కాపాడాలని ప్రదర్శనలు ఇచ్చి మరో రూ.25 వేలు సమకూర్చారు. ‘మంత్రి కేటీఆర్‌కి కూడా షాలిని పరిస్థితిపై ట్వీట్‌ చేస్తే వివరాలు పంపండి అంటూ స్పందించారు. మేం పంపాం. ఇంకా స్పందన రాలేదు’ అని వీరు చెప్పారు.  

ముందుకొచ్చిన సంస్థలు
స్నేహితురాలిని రక్షించుకోవడానికి సహ విద్యార్థులు పడుతున్న తపన చూసి హైదరాబాద్‌ కైట్స్, నిఫ్టా, మిలాప్‌ తదితర సంస్థలు ‘మేము సైతం’ అంటూ ముందుకొచ్చాయి. అలా ఇంకో రూ.5 లక్షల దాకా పోగయ్యాయి. ‘షాలినికి ప్రస్తుతం బసవతారకం ఆస్పత్రిలో కీమోథెరపీ  చేస్తున్నారు. విడతల వారీగా ఏదో ఒక మార్గంలో ఆమె చికిత్స ఆసాంతం మా వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నాం’ అని మణిరాజ్‌ వివరించాడు.వరుస ఈవెంట్లు ఇందులో భాగంగా ఆదివారం ‘స్కెచ్‌ ఫర్‌ షాలిని’ పేరిట ఆమె ఫ్రెండ్స్‌ ఒక ఈవెంట్‌ ప్లాన్‌ చేశారు. మాదాపూర్‌లోని ఫీనిక్స్‌ అరెనా వేదికగా ఔత్సాహిక చిత్రకళా విద్యార్థులు దీనిలో పాల్గొని లైవ్‌ స్కెచ్‌ వేస్తారు. ‘ఈ కార్యక్రమానికి ఎంట్రీ ఫీ లేదు. 150 మంది దాకా ఆర్ట్‌ స్టూడెంట్స్‌ వచ్చి స్కెచ్‌ వేయవచ్చు. ‘ద బెస్ట్‌’ అనుకున్న పెయింటింగ్‌కి తగినంత గుర్తింపు వచ్చేలా చేస్తాం.  అక్కడే డొనేషన్‌ బాక్స్‌ పెడతాం.

స్కెచ్‌ ఫర్‌ షాలిని..
లైవ్‌ స్కెచ్‌ ప్రదర్శనకు వచ్చిన వారు విరాళాలు ఇవ్వవచ్చు’ అంటూ తమ కార్యక్రమం గురించి వివరించారు మిత్రబృందం. ఇదే కాకుండా వచ్చే వారం 5కే రన్‌ కూడా నిర్వహిస్తున్నామని, ఇకపై ప్రతి వారాంతంలో ఇలా ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకుంటున్నామన్నారు. షాలిని చాలా హుషారుగా కనిపిస్తోందని, ఆమె తప్పకుండా సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ అవుతుందని హైదరాబాద్‌ కైట్స్‌ నిర్వాహకులు కార్తీక్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.  

స్నే‘హితానికి’ నిజమైన అర్థం చెబుతున్న ఈ విద్యార్థులకు సహకరించాలనుకునేవారు 9966862800/ 9705110802నంబర్లలో సంప్రదించవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement