ఆన్‌లైన్‌లో..అనుబంధం..


 ఒకప్పుడు రాఖీ పండుగ అంటే.. రాఖీ కొనాలి... దానిని పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించేందుకు సెంటర్‌కు వెళ్లడం, కవర్లు కొనడం వంటి ఇబ్బందులు ఉండేవి. ఇంత చేసినా చిరిగిపోకుండా ఆత్మీయులైన సోదరులకు రాఖీలు అందుతాయా, అదీ సమయానికి చేరుతాయా, లేదా అనే అనుమానాలతో అక్కాచెల్లెళ్లు మధనపడేవారు. ఇలాంటి ఇబ్బందులను తీర్చేందుకు ఆన్‌లైన్ ద్వారా రాఖీలు పంపించే పద్ధతి అందుబాటులోకి వచ్చేసింది.



 కేవలం ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ఒక్క క్లిక్ ద్వారా నిర్ణీత చిరునామాకు రాఖీ చేరిపోతుంది. జిల్లా, రాష్ట్రం, దేశం, విదేశాల్లో ఎక్కడికైనా రాఖీ పంపించే సౌకర్యాన్ని పలు వెబ్‌సైట్లు అందుబాటులోకి తెచ్చాయి. దీంతో వరంగల్ నగరంలోని పలువురు మహిళలు, యువతులు ఈసారి తమ సోదరులకు ఆన్‌లైన్‌లో రాఖీలు పంపించేందుకు సిద్ధమయ్యారు.



 షాపుల్లో మాదిరిగానే...

 రాఖీలు అమ్మే షాప్‌నకు వెళ్తే వేల రకాలు.. బంగారు, వెండి రాఖీలు ఇలా ఎన్నో అందుబాటులో ఉంటాయి. మనకు నచ్చిందే కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది. అయితే ఆన్‌లైన్‌లో అన్ని రకాలు ఉంటాయా, లేదా అనే బెంగ కొందరికి ఉంది. కానీ ఆన్‌లైన్‌లో కూడా వేల సంఖ్యలో రకాల రాఖీలు అందుబాటులో ఉంచడంతో మహిళలు, యువతులు ఈసారి ఇంటర్నెట్ రాఖీకే తమ ఓటు అంటున్నారు. దీంతో ఈ సారి నగరం నుంచి సుమారుగా 10వేల మందికి పైగానే తమ సోదరులకు ఆన్‌లైన్ ద్వారా రాఖీలు పంపించనున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా.



 వేల రకాలు

 తక్కువ నాణ్యత గల వజ్రాలు పొదిగిన రాఖీ, బంగారు పూతతో చేసిన రాఖీ, ముత్యాల జర్దోసి రాఖీ.. ఇలా చెప్పుకుంటే పోతే ఆన్‌లైన్‌లో కూడా వెయ్యికి పైగా రకాల రాఖీలు దర్శనమిస్తున్నాయి. ఇక చిన్నపిల్లల మనస్సు దోచే చోటా బీమ్, మిక్కీ మౌస్, యాంగ్రీ బర్డ్స్ బొమ్మలతో కూడిన రాఖీలకు కొదువే లేదు. రూ.300 నుంచి రూ.10వేల వరకు ధరలో విభిన్న రాఖీలు ఆన్‌లైన్‌లో సిద్ధంగా ఉన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top