రెండో రోజు 8 నామినేషన్లు | second day eight nominations | Sakshi
Sakshi News home page

రెండో రోజు 8 నామినేషన్లు

Apr 3 2014 11:46 PM | Updated on Mar 28 2018 10:59 AM

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు ఒక్కరొక్కరుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.

తాండూరు, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, న్యూస్‌లైన్:  సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు ఒక్కరొక్కరుగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. గురువారం జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి. తాండూరులోని ఇందిరానగర్‌కు చెందిన శ్రీగోపాల్, అలియాస్ చిలుక గోపాల్ స్వతంత్ర అభ్యర్థిగా తాండూరు అసెంబ్లీ నుంచి పోటీకి నామినేషన్ వేశారు. మధ్యాహ్నం 12.10గంటల తర్వాత అనుచరులతో  వచ్చి నియోజకవర్గ ఎన్నికల అధికారి హరీష్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. 2009లోనూ గోపాల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. 2000 సంవత్సరం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు గోపాల్‌కు రామచిలుక గుర్తు వచ్చింది. అప్పటినుంచి ఆయన్ను చిలుక గోపాల్ అంటున్నారు.
 
‘పట్నం’ అసెంబ్లీకి ఒకటి..
ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక నామినేషన్ దాఖలైంది. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తరఫున ఈ నామినేషన్ దాఖలైంది. కిషన్‌రెడ్డి సతీమణి మంచిరెడ్డి ముకుంద ఒక సెట్ నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.విఠల్‌కు అందజేశారు. కిషన్‌రెడ్డి తనయుడు, ఐఎస్ సదన్ కార్పొరేటర్ మంచిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి, పట్నం టీడీపీ అధ్యక్షుడు జిలమోని రవీందర్ ఆమె వెంట ఉన్నారు. ఈ నెల 9న భారీ ర్యాలీ నిర్వహించి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మరో సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నట్టు తెలిసింది.

మహేశ్వరం అసెంబ్లీ స్థానానికి ఇద్దరు..
మహేశ్వరం అసెంబ్లీ స్థానానికి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, సరూర్‌నగర్ ఆర్డీఓ కే.యాదగిరిరెడ్డి, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గోపిరామ్ తెలిపారు. టీఆర్‌ఎస్ తరఫున నోముల మల్లేష్, రాష్ట్రీయ సమైక్య సమితి పార్టీ నుంచి సుతారపు పద్మయ్యలు నామినేషన్ దాఖలు చేశారన్నారు. ఇదిలా ఉండగా ఉప్పల్ అసెంబ్లీ స్థానానికి బీజేపీ అభ్యర్థి ఎన్‌వీవీఎస్ ప్రభాకర్ నాలుగు సెట్ల నామినేషన్లు వేశారు.

Advertisement
 
Advertisement
Advertisement