ఆర్టీసీ, మెట్రో, ఉబర్‌లతో ప్రత్యేక యాప్‌

RTC and Metro and Uber with Special App - Sakshi

ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మ 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ప్రజలను ప్రజా రవాణా వ్యవస్థ వైపు మళ్లించేందుకు ఆర్టీసీ, మెట్రో, ఉబర్, ఓలా, ఇతర ప్రైవేటు మినీ వాహనాలతో ఓ యాప్‌ను తీసుకురానున్నట్లు ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌ శర్మ చెప్పారు. మంగళవారం ఆయన బస్‌భవన్‌లో మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి తదితరులతో కలసి విలేకరులతో మాట్లాడారు. నగరంలో సౌకర్యవంత ప్రయాణానికి పరిష్కారాలు అన్వేషించటం కోసం మెట్రో రైలు, ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌ తదితర సంస్థల అధికారులతో కలసి ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.

తొలిసారిగా ఈ టాస్క్‌ఫోర్స్‌ సమావేశమైంది. ఈ సందర్భంగా సునీల్‌ శర్మ మాట్లాడుతూ.. ఒక ప్రత్యేక యాప్‌ను రూపొందించి మెట్రో, ఆర్టీసీ, ఉబర్, ఓలా తదితరాలను దాని పరిధిలోకి తీసుకువస్తామని చెప్పారు. వీటన్నిటికి కలిపి ఒకే కామన్‌ టికెట్‌ ఉండేలా చూస్తామన్నారు. అయితే ఈ ఆలోచన ప్రస్తుతానికి తొలిదశలోనే ఉందని, నెల రోజుల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. భవిష్యత్‌లో మెట్రోరైలుతో ఆర్టీసీకి పోటీ ఉండదని, రెండు ప్రజా రవాణా సంస్థల మధ్య సమన్వయం ఉంటుందన్నారు. కాలనీ ప్రాంత ప్రయాణికులకు మైట్రో స్టేషన్‌ వరకు తీసుకువచ్చే విధంగా బస్సులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆర్టీసీ–మెట్రో అనుసంధానంపై రెండు నెలల్లో ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థ పెరిగితే వ్యక్తిగత వాహనాలు, కాలుష్యం తగ్గుతుందని మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి అన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top