బీఆర్‌జీఎఫ్@ రూ.28.66 కోట్లు

బీఆర్‌జీఎఫ్@ రూ.28.66 కోట్లు - Sakshi


సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: వెనుకబడిన ప్రాంత అభివృద్ధి నిధి (బీఆర్‌జీఎఫ్)కి జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) ఆమోదముద్ర వేసింది. 2014-15 వార్షిక సంవత్సరానికి వెనుకబడిన ప్రాంత అభివృద్ధి నిధి కింద రూ.28.66 కోట్లతో ప్రతిపాదించిన 1,592 పనులకు పచ్చజెండా ఊపింది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన డీపీసీ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.



జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన ఈ నిధుల్లో గ్రామీణ రోడ్ల నిర్మాణానికే పెద్దపీట వేశారు. రూ.11.89కోట్లతో 559 కొత్త రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదించగా, ఆ తర్వాత పల్లెల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు రూ.8.72కోట్లు, గ్రామీణ నీటి సరఫరాను ఆధునీకరించేందుకు రూ.5.70 కోట్లు నిర్దేశించారు. జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి, జెడ్పీ సీఈఓ చక్రధర్‌రావు, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, ఆయా పురపాలక సంఘాల అధ్యక్షులు, డీపీసీ సభ్యులు ఈసీ శేఖర్‌గౌడ్, బొక్క జంగారెడ్డి హాజరైన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది.

 

హాస్టళ్లను విస్మరించడం అన్యాయం : మంచిరెడ్డి

బీఆర్‌జీఎఫ్ నిధుల కేటాయింపుల్లో సంక్షేమ హాస్టళ్లను పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రస్తావించారు. ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలకు రూ.కోటిన్నర కేటాయించిన జిల్లా యంత్రాంగం.. బీసీ హాస్టళ్లను విస్మరించడం దా రుణమన్నారు. పదేళ్ల నుంచి కనీసం రంగులు వేసేం దుకు కూడా ప్రభుత్వం నిధులు కేటాయించలేద ని, శిథిలావస్థకు చేరిన భవనాల్లో కనీస సౌకర్యాలు కల్పిం చేందుకు సరిపడా నిధులు కేటాయించాలని కోరారు.

 

వైద్యో నారాయణ.. : తీగల

జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ పనితీరు అధ్వానంగా తయారైందని మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. పీహెచ్‌సీలో వైద్యులు ఉండడంలేదని, ఖాళీలను భర్తీ చేసే విషయంలో కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. మహేశ్వరంలో 100 పడకల ఆస్పత్రి మంజూరైనా పనులు ఇంకా మొదలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 

పాతపనులను ప్రతిపాదించడం సరికాదు: మలిపెద్ది

బీఆర్‌జీఎఫ్ కింద చేపట్టే పనుల్లో డుప్లికేషన్ జరుగకుండా చూడాలని మేడ్చల్ శాసనసభ్యుడు మలిపెద్ధి సుధీర్‌రెడ్డి స్పష్టం చేశారు. పాత పనులనే మళ్లీ ప్రతిపాదించినట్లు తన దృష్టికి వచ్చిందని, వాటిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

 

కొత్త వాహనాలివ్వండి: యాదయ్య

ప్రభుత్వ అధికారులను వాహనాల కొరత పట్టిపీడిస్తోందని, కాలంచెల్లిన వాహనాల స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కోరారు. బీఆర్‌జీఎఫ్ కింద సాగునీటి పారుదలకు కూడా నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాలన్నారు. తన నియోజకవర్గంలోని చాలా పీహెచ్‌సీలలో వైద్యుల్లేరని, ఖాళీలను భర్తీ చేసేందుకు చొరవ చూపాలని అన్నారు.

 

ఆంగ్లమాధ్యమంలో బోధన: చామకూర

సర్కారు పాఠశాలల్లో తెలుగు మీడియంలో విద్యాబోధన వల్ల భవిష్యత్తులో విద్యార్థులకు భాషాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని, ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే విద్యాబోధనను ఆంగ్లంలో చేయాలని మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి సూచిం చారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ రూపొందించాలని కోరారు.

 

పాత పనులకే దిక్కులేదు: సంజీవరావు

గత ఏడాది బీఆర్‌జీఎఫ్ పనులే ఇంకా మొదలు కాలేదని వికారాబాద్ శాసనసభ్యుడు సంజీవరావు అన్నారు. నిధుల లేమితో అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మర్పల్లిలో కస్తుర్బా స్కూల్ నిర్మాణాన్ని మధ్యలోనే వదిలి కాంట్రాక్టర్ ఉడాయించారని, ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్‌జీఎఫ్ పనులు నత్తనడకన సాగుతున్నాయని అన్నారు. బంట్వారం మండలంలో టీచర్ల కొరత తీవ్రంగా ఉందని, 15 ఏకోపాధ్యాయ పాఠశాలలకు కూడా టీచర్లు రాకపోవడంతో మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 

తాగునీరు అందించండి: ప్రకాశ్‌గౌడ్

చెడిపోయిన బోర్లను బాగు చేయకుండా కొత్త వాటిని వేయాలడాన్ని రాజేంద్రనగ ర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తప్పుబట్టారు. చెడినవాటికి మరమ్మతులు చేస్తే నీటి సమస్యను అధిగమించవచ్చని అన్నారు. శంషాబాద్‌కు ఇప్పటివరకు తాగునీటి సరఫరా చేయడంలేదని, మణికొండలో వాటర్‌వర్క్స్, ఆర్‌అండ్‌బీ అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగా రోడ్డు నిర్మాణ పనులు ఆగిపోయానని డీపీసీ దృష్టికి తెచ్చారు.

 

నిధుల వాటా పెంచండి: వివేక్

కుత్బుల్లాపూర్‌లోని ప్రగతినగర్, బాచుపల్లి, దూలపల్లి, నిజాంపేట్ తదితర గ్రామాల్లో జనాభా భారీగా పెరిగిందని, వారి అవసరాలు తీర్చే విధంగా నిధులు కేటాయింపులు చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేఎం వివేక్ స్పష్టం చేశారు. చాలా గ్రామాలకు రోడ్డు మార్గాలు వేసేందుకు కూడా నిధుల కొరత ఏర్పడిందని, ఈ అంశంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.

 

ఫిరంగినాలాను శుద్ధి చేయండి: ఈసీ శేఖర్‌గౌడ్

చారిత్రిక ఫిరంగి నాలా కుచించుకుపోతుందని, దీనిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని డీపీసీ సభ్యుడు ఈసీ శేఖర్‌గౌడ్ అన్నారు. ఆదిబట్ల గ్రామంలో ఈ నాలా మురికి కాల్వగా మారిందని, దీన్ని శుద్ధి చేసేందుకు నిధులు కేటాయించాలని కోరారు.

 

సమృద్ధిగా నిధులు: మహేందర్‌రెడ్డి, మంత్రి

బీఆర్‌జీఎఫ్ నిధులేకాకుండా వివిధ పద్దుల కింద ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురానున్నట్లు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. గత ఏడాది చేపట్టిన 839 పనుల్లో 644 పనులు అసంపూర్తిగా ఉన్నాయని, 23 పనులు ఇప్పటికీ  ప్రారంభంకాలేదని, ఈసారి పనుల నిర్వహణ లో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని చెప్పారు. గ్రామీణ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్న అంశం తన దృష్టికి వచ్చిందని, త్వరలోనే దీనిపై ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి టీచర్ల ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపా రు. సంక్షేమ హాస్టళ్లు, ఇరిగేషన్ శాఖకు బీఆర్‌జీఎఫ్ నిధు లు కేటాయించాలనే సభ్యుల అభిప్రాయం ఆహ్వానించదగ్గదని, ఆ మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నెల 17వ తేదీ తర్వాత శాఖలవారీగా సమీక్షలు జరపాలని నిర్ణయం తీసుకున్నామని, ఈ సమావేశానికి ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. నగర పంచాయతీల్లో అభివృద్ధి పనులకు రూ.2 కోట్లు కేటాయించామని తెలిపారు.

 

అభివృద్ధికి సహకరించండి: సునీత


రాజధానికి చేరువలోనే ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఇంకా అభివృద్ధి చెందని పల్లెలు ఉన్నాయని, వీటిన్నింటిలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు బీఆర్‌జీఎఫ్ నిధులను వినియోగించనున్నట్లు జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.28.66 కోట్లు ఖర్చు చేస్తున్నామని, మరిన్ని నిధులు రాబట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. అభివృద్ధి పనులకు ప్రజాప్రతినిధులు సహకార ం తప్పనిసరని, టీచర్ల కొరతను అధిగమించేందుకు తమ వద్ద పీఏలుగా నియమించుకున్న ఉపాధ్యాయులను వెనక్కి పంపాలని ఆమె ఎమ్మెల్యేలకు సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top