యాదాద్రి–వరంగల్ హైవేకు మరమ్మతులు
ఎన్హెచ్ఏఐ సీజీఎంకు మంత్రి తుమ్మల ఆదేశం
సాక్షి, హైదరాబాద్: వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారి విషయంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) అనుసరిస్తున్న తీరుపై రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్–యాదాద్రి మధ్య నాలుగు వరసల రహదారి నిర్మాణం పూర్తి కాగా, ఇప్పుడు యాదాద్రి–వరంగల్ మధ్య నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం ఉన్న రోడ్డు నిర్వహణ సరిగా లేకపోవటంతో అది బాగా దెబ్బతింది.
కీలకమైన రహదారి కావటంతో దీనిపై నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉంటోంది. రోడ్డు గుంత లమయం కావటంతో వాహనాల వేగం తగ్గిపోవటమే కాక ప్రమాదాలూ జరుగుతు న్నాయి. గుంతలతో వాహనాలు దెబ్బతింటున్నాయి. ఆర్టీసీ బస్సులో ఉప్పల్ నుంచి వరంగల్ వరకు గతంలో రెండున్నర గంటల్లో వెళ్లగా ఇప్పుడు మూడున్నర గంటలకుపైగా సమయం పడుతోంది. బస్సులు కూడా దెబ్బతింటున్నాయి. దీన్ని ఆర్టీసీ తీవ్రంగా పరిగణించినట్టు ఆర్టీసీ ఎండీ రమణారావు ‘సాక్షి’తో చెప్పారు. ఈ రోడ్డును ఎన్హెచ్ఏఐకి అప్పగించేప్పుడు మంచి కండిషన్లోనే ఉందంటూ జాతీయ రహదారుల విభాగం ఈఎన్సీ గణపతిరెడ్డి వివరణ ఇచ్చారు.
‘సాక్షి’ కథనంతో కదలిక..: రోడ్డు బాగా పాడైన చిత్రాలతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన మంత్రి తుమ్మల బుధవారం ఎన్హెచ్ఏఐ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రోడ్డు నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ ప్రతినిధు లను కూడా సమావేశానికి పిలిచారు. నిర్మాణ ఒప్పందంలో.. పాత రోడ్డు నిర్వహణ అంశం ఉన్నా దాన్ని పట్టించుకోకపోవటం సరికాదన్నారు.దీనిపై నిర్మాణ సంస్థ ప్రతినిధుల సమావేశంలో స్పష్టం చేస్తానని అధికారులకు చెప్పారు. ఒప్పందాన్ని నిర్లక్ష్యం చేస్తే విషయాన్ని ఢిల్లీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. దీనిపై ఎన్హెచ్ఏఐ తెలంగాణ సీజీఎంతో మంత్రి ఫోన్లో మాట్లాడి వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు.