కుటుంబ సభ్యులనే బలిగొన్న కారు | Sakshi
Sakshi News home page

కుటుంబ సభ్యులనే బలిగొన్న కారు

Published Sat, Apr 1 2017 12:50 AM

కుటుంబ సభ్యులనే బలిగొన్న కారు - Sakshi

- పార్కు చేస్తుండగా బ్రేక్‌కు బదులు ఎక్స్‌లేటర్‌ తొక్కడంతో ప్రమాదం
తల్లీకూతురు దుర్మరణం


రామచంద్రాపురం: ఓ వ్యక్తి నిర్లక్ష్యం తన కుటుంబ సభ్యులిద్దరి ప్రాణాలను బలిగొంది. కారును ఇంట్లో పార్కు చేస్తున్న క్రమంలో జరిగిన పొరపాటుకు అతని తల్లి, చెల్లి బలయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సత్యనారాయణ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి. ఇటీవల కారు కొనుగోలు చేశాడు. ఉగాది నాడు తన తండ్రి సంవత్సరీకం ఉండడంతో కంది మండలం అల్లూర్‌లో ఉండే అతని చెల్లెలు పద్మ(25) పుట్టింటికి వచ్చింది.

గురువారం సత్యనారాయణ, అతని బావ బుచ్చిరాజులు కలసి కారులో బయటకు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చారు. సత్యనారాయణ తన కారును ఇంట్లో పార్క్‌ చేసేందుకు ప్రయత్నించాడు. బ్రేక్‌ వేయాల్సిన క్రమంలో ఎక్స్‌లేటర్‌ తొక్కాడు. దీంతో ఆ పక్కనే ఉన్న సత్యనారాయణ తల్లి సత్తమ్మ (65), చెల్లెలు పద్మ (25)పైకి కారు దూసుకెళ్లింది. తీవ్ర గాయాలైన వారిని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు.

Advertisement
Advertisement