
‘సమగ్ర సర్వే’కు సర్వం సిద్ధం
సంక్షేమ పథకాలను కేవలం అర్హులకే అందించాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సమగ్ర కుటుంబ సర్వే’కు సర్వం సిద్ధమైంది.
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ పథకాలను కేవలం అర్హులకే అందించాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సమగ్ర కుటుంబ సర్వే’కు సర్వం సిద్ధమైంది. మంగళవారం జరగనున్న ఈ సర్వేలో దాదాపు కోటి కుటుంబాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించనున్నారు. సుమారు 3.76 లక్షల మంది ఎన్యూమరేటర్లు (సర్వే వివరాలు సేకరించేవారు) ఒకేరోజులో ఈ సర్వేను నిర్వహించనున్నారు. ఈ మేరకు గ్రామాలకు సర్వే పత్రాలను చేర్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఎన్యూమరేటర్లను తీసుకెళ్లేందుకు వాహనాలు కూడా సిద్ధమయ్యాయి. మరోవైపు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకు తరలిన వారు సర్వేలో వివరాలను వెల్లడించడం కోసం తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. ప్రధానంగా మహారాష్ట్రలోని ముంబై, షోలాపూర్, భీవండి, గుజరాత్లోని సూరత్, అహ్మదాబాద్లతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ ప్రజలు సొంత ఊళ్లకు వస్తున్నారు. ఇందులో చాలా మంది ఇప్పటికే ఇళ్లకు చేరుకున్నారు కూడా.
స్వచ్ఛందమే..!
ఎలాంటి అనుమానాలు, సందేహాలకు తావివ్వకుండా ప్రజలు ఎన్యుమరేటర్ల వద్ద స్వచ్ఛందంగా తమ వివరాలను నమోదు చేయించుకునేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. సొంత ప్రాంతంలో కాకుండా వేరేచోట నివసిస్తున్నా, మరో చోట స్వస్థలం ఉన్నా... ఏదో ఒకచోట సమాచారాన్ని అందిస్తే సరిపోతుందని అధికారులు పేర్కొంటున్నారు. సర్వేలో ప్రజలు తాము చెప్పదలుచుకున్న సమాచారాన్నే ఇవ్వవచ్చని.. ఇష్టం లేకపోతే చెప్పాలన్న బలవంతమేమీ ఉండదని చెబుతున్నారు.
సొంతూళ్లకు జనం..
ఉపాధి కోసం తెలంగాణలోని కరీంనగర్, మెదక్, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాలకు, ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు వలస వెళ్లారు. మంగళవారం జరిగే సర్వే నేపథ్యంలో వారంతా సొంత ఊళ్లకు తిరిగివస్తున్నారు. సమగ్ర సర్వేపై ప్రభుత్వ ప్రకటన వెలువడగానే.. సర్వే జరిగే రోజైన మంగళవారం కంటే ముందే స్వస్థలాలకు చేరుకునేందుకు చాలా మంది ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్నారు కూడా. మెదక్ జిల్లా నుంచి మహారాష్ట్ర, గుజరాత్లకు వలసవెళ్లిన దాదాపు లక్ష మందిలో చాలా మంది ఇప్పటికే స్వస్థలాలకు చేరుకున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాకు సంబంధించి కూడా 50 వేలకు పైచీలుకు ప్రజలు సొంతూళ్లకు చేరుకున్నట్లు చెబుతున్నారు. నిజామాబాద్, మహబూబ్నగర్ జిల్లాల వారు కూడా పెద్ద సంఖ్యలోనే తిరిగొచ్చారు. ఇక హైదరాబాద్లో ఉంటున్న వివిధ జిల్లాలవారు సొంతూళ్లకు ప్రయాణమవుతున్నారు. ఈ నేపథ్యంలో.. ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. అదనపు బస్సుల ఏర్పాటుకు ఆర్టీసీ సన్నద్ధమైంది.
సంక్షేమ ఫలాలే ప్రధానం...
రేషన్కార్డులు, బలహీనవర్గాలకు గృహాలు, పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలన్నీ అర్హులైన వారికే అందించేందుకు తోడ్పడేలా సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మెజారిటీ ప్రజలు తమ వివరాలు, సమాచారాన్ని నమోదు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. సంక్షే మ పథకాల అమలుకు సంబంధించి ఈ సర్వే సమాచారాన్ని ఆధారంగా తీసుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అన్ని వివరాలను ఒక క్రమ పద్ధతిలో నమోదు చేసేందుకు చర్యలు చేపట్టింది. వివరాల నమోదుకు సంబంధించి ఎన్యుమరేటర్ల కొరత ఏర్పడకుండా ఏర్పాట్లు చేసింది. వారికి పూర్తిస్థాయిలో శిక్షణ అందించడంతో పాటు వారికి కేటాయించిన ప్రాంతాలకు సకాలంలో చేర్చేలా రవాణాను సిద్ధం చేసింది.
స్టిక్కర్లు, చెక్లిస్ట్ల పంపకం..
హైదరాబాద్లో ఎన్యుమరేటర్లు ఆది, సోమ వారాల్లో తమకు కేటాయించిన ఇళ్లకు వెళ్లి స్టిక్కర్లు అంటిస్తున్నారు. సర్వే కంటే ముందే తమకు కావాల్సిన సమాచారంపై రెండురోజుల పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సర్వేకోసం ఏయే వివరాలు కావాలో చెక్లిస్ట్లను అందజేస్తున్నారు. ఇంకా ఏవైనా సందేహాలుంటే సంప్రదించేలా ఎన్యుమరేటర్ల ఫోన్ నెంబర్లను ఇంటిపై అంటించే స్టిక్కర్లపై పొందు పరుస్తున్నారు.
ప్రయాణికులతో పోటెత్తిన ఎంజీబీఎస్
సర్వే కోసం జిల్లాల్లోని తమ స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులతో ఆదివారం హైదరాబాద్లోని మహాత్మాగాంధీ బస్స్టేషన్ (ఎంజీబీఎస్) పోటెత్తింది. ఉదయం నుంచే ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరగడంతో ప్లాట్ఫారాలన్నీ కిటకిటలాడాయి. సర్వే కోసం ముందుగానే ఆర్టీసీ అధికారులు 225 అదనపు బస్సులను సిద్ధం చేసినా... అంచనాలకు మించి జనం రావడంతో మరో 650 అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. అయితే అవికూడా జనంతో కిక్కిరిసిపోవడంతో కొందరు బస్సుటాప్పైకి ఎక్కి ఊళ్లకు బయలుదేరారు.
సక్రమంగా సాగేలా చూడండి: డీజీపీ
‘సమగ్ర కుటుంబ సర్వే’ సజావుగా సాగేలా చూడాలని... ఈ విషయంలో రెవెన్యూ, ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం కావాలని డీజీపీ అనురాగ్శర్మ పోలీసు అధికారులను ఆదేశించారు. సర్వేలో పాల్గొంటున్న పోలీసు సిబ్బంది, అధికారులు పూర్తిగా సివిల్ దుస్తుల్లో హాజరుకావాలని.. ఆ విధుల్లో ఉంటూనే శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా కన్నేసి ఉంచాలని సూచించారు. ఈ మేరకు హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లతో పాటు తొమ్మిది జిల్లాల ఎస్పీలు, రేంజ్ల డీఐజీలకు డీజీపీ కార్యాలయం నుంచి సర్క్యులర్ అందింది. సర్వేలో పోలీసుశాఖ నుంచి 60 శాతం సిబ్బంది, అధికారులు పాలు పంచుకుంటుండగా.. మిగతా వారు బందోబస్తు విధుల్లో నిమగ్నమవుతారు. సున్నిత ప్రాంతాలు, సమస్యలు తలెత్తుతాయని అనుమానాలున్న చోట పోలీస్ పికెట్లను ఏర్పాటుకు ఆదేశించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇంటెలిజెన్స్ అధికారులు ప్రత్యేకంగా నిఘా వేసి ఉంచారు. ఖమ్మం-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో గ్రేహౌండ్స్ బలగాలతో గాలింపు జరుపుతున్నారు. జంట కమిషనరేట్లకు చెందిన దాదాపు ఐదు వేల మంది పోలీసులను సర్వేకోసం వినియోగిస్తుండగా.. జిల్లాల్లో దాదాపు అరవై శాతం మంది పాల్గొంటున్నారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.