నిజామాబాద్‌ వరకూ రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ | Rayalaseema Express till Nizamabad | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌ వరకూ రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌

Oct 30 2017 12:59 AM | Updated on Oct 30 2017 12:59 AM

Rayalaseema Express till Nizamabad

తిరుపతి అర్బన్‌ : తిరుపతి నుంచి తెలంగాణలోని హైదరాబాద్‌ (నాంపల్లి) వరకూ ప్రస్తుతం 17430 నంబరుతో నడుస్తున్న రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇక సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌గా మారనుంది. ప్రయాణికుల సౌకర్యార్థం దీనిని నిజామాబాద్‌ వరకూ పొడిగించి రిజర్వేషన్‌ ప్రక్రియ కూడా ప్రారంభించారు. నవంబర్‌ ఒకటి నుంచి తిరుపతిలో బయలుదేరి నిజామాబాద్‌ వరకూ వెళ్లనుంది. గతంలో తెలంగాణకు చెందిన నిజామాబాద్‌ ప్రజాప్రతినిధులు, ప్రయాణికులు తిరుపతికి రైలు సౌకర్యం కల్పించాలని పలుమార్లు అభ్యర్థించారు. వారి అభ్యర్థన మేరకు రైల్వేశాఖ నిజామాబాద్‌ వరకూ పొడిగించింది. 

రైలు వెళ్లే మార్గాలివే..
రాయలసీమ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ 12793 నంబరుతో తిరుపతి నుంచి నిజామాబాద్‌కు వెళ్లి తిరుగు ప్రయాణంలో 12794 నంబరుతో నిజామాబాద్‌ నుంచి తిరుపతికి నడుస్తుంది. గతంలో వెళ్లిన నాంపల్లితో సంబంధం లేకుండా బేగంపేట, సికింద్రాబాద్, మేడ్చల్‌ మీదుగా నిజామాబాద్‌కు వెళ్లేలా రూట్‌ మ్యాప్‌ సిద్ధంచేశారు.

14 బోగీలు.. 1051 బెర్తులు
ఈ రైలులో 7 స్లీపర్‌ క్లాస్‌ బోగీల్లో 504 బెర్తులు, ఒక సెకండ్‌ ఏసీ బోగీలో 48 బెర్తులు, ఒక త్రీటైర్‌ ఏసీలో 67 బెర్తులు, 4 జనరల్‌ బోగీల్లో 432 మంది ప్రయాణికులు ప్రయాణించేలా ఏర్పాట్లు చేశారు. తిరుపతి నుంచి నిజామాబాద్‌ వెళ్లేందుకు 16 గంటల సమయం పడుతుంది.

ఈ రైలు తిరుపతిలో రోజూ సాయంత్రం 4.25 గంటలకు బయలుదేరి మరుసటిరోజు తెల్లవారుజామున 5.15 గంటలకు సికింద్రాబాద్, ఉదయం 08.20 గంటలకు నిజామాబాద్‌ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో నిజామాబాద్‌ నుంచి మధ్యాహ్నం 02.05 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.25 గంటలకు సికింద్రాబాద్, మరుసటి రోజు ఉదయం 8 గంటలకు తిరుపతి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. 

Advertisement
 
Advertisement
Advertisement